
ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రభుత్వం ఈ నెల 4వ తేదీన శ్రీకారం చుడుతుందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఆటో డ్రైవర్ సేవలో పథకంపై శుక్రవారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఆదాయం తగ్గకుండా ఉండేందుకు ఒక్కో ఆటో డ్రైవర్కు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఈ పథకానికి అర్హులను ఇప్పటికే గుర్తించడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమానికి జిల్లా నుండి కొంత మంది హాజరు అవుతారని తెలిపారు. శాసన సభ నియోజక వర్గం స్థాయిలో సైతం కార్యక్రమాలను 4వ తేదీన ఏర్పాటు చేయాలని అన్నారు. స్థానిక శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ఆయన చెప్పారు. రవాణా శాఖ ఉప కమిషనర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు నిర్వహణకు అవసరమగు అన్ని చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.ఈ టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.







