గుంటూరు, సెప్టెంబర్ 14 : తురకపాలెం గ్రామంలో యురేనియం కాలుష్యంపై ఆందోళన చెందవలసిన అవసరం లేదనిజిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తురకపాలెం గ్రామంలో ఇటీవల మరణాలు సంభవించిన నేపథ్యంలో సెకండరీ హెల్త్ సంచాలకురాలు డాక్టర్ సిరి ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి కమిటీ గ్రామాన్ని సందర్శించిందన్నారు. కమిటీ
గ్రామంలో తాగునీటి వనరులు, పారిశుధ్యం, జీవనశైలి, వ్యవసాయ సంబంధిత అంశాలు, పర్యావరణ పరిస్థితులను పరిశీలించడం, క్లినికల్ కేసు రికార్డులను ధృవీకరించడం జరిగిందన్నారు. గ్రామంలోని నేల, నీటి నమూనాలను సేకరించి కాలుష్య కారణాలను గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించారని ఆమె పేర్కొన్నారు.గ్రామంలో 8 నీటి నమూనాలను — కమ్యూనిటీ వాటర్ సోర్సులు, మరణించిన వారి ఇళ్ల బోరు బావుల నుండి సేకరించారని ఆమె తెలిపారు. వీటిలో బయాలజికల్ కాలుష్యం తేలిందని, కొన్ని నమూనాలలో ఏరోబిక్ మైక్రోబయల్ కౌంట్ 4000 cfu/ml నుండి 9000 cfu/ml వరకు నమోదైందన్నారు. కొన్ని మీడియా కథనాల్లో తురకపాలెం భూగర్భ జలాల్లో యురేనియం కలుషితం ఉందని పేర్కొనడం జరిగిందని, తాగు నీటిలో యురేనియం పరిమితి భారత ప్రమాణాల సంస్థ (BIS) మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం, తాగు నీటిలో యురేనియం పరిమితి లీటరుకు 30 మైక్రో గ్రాములు (0.03 mg/l)గా ఉందన్నారు. అదనంగా, పరమాణు శక్తి నియంత్రణ మండలి (AERB) అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని లీటరుకు 60 మైక్రో గ్రాములు (0.06 mg/l) వరకు పరిమితిని సూచిస్తోందని ఆమె చెప్పారు.తురకపాలెం గ్రామం నుండి వచ్చిన వాస్తవ నివేదిక ప్రకారం -తురకపాలెంలో సేకరించిన 8 నీటి నమూనాల్లో 4 నమూనాలలో యురేనియం ఆనవాళ్లు అనుమతించిన పరిమితి లోపలే నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు .B2 Sample – 0.001 mg/l B4 Sample – 0.013 mg/l B5 Sample – 0.011 mg/l B6 Sample – 0.005 mg/l
మిగిలిన 4 నమూనాల్లో యురేనియం ఆనవాళ్లు 0.001 mg/l కంటే తక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. ఈ నివేదిక NABL ప్రమాణీకృత, FSSAI గుర్తింపు పొందిన ల్యాబ్ ద్వారా ధృవీకరించడం జరిగిందని ఆమె చెప్పారు. తురకపాలెం గ్రామంలో యురేనియం కాలుష్యంపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.ప్రభుత్వం చేపట్టిన చర్యలుబయాలజికల్ కాలుష్యం నియంత్రణకు గ్రామానికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోందని జిల్లా కలెక్టర్ అన్నారు.జిల్లా యంత్రాంగం గత వారం రోజులుగా ఆహార వసతులు కల్పిస్తుందని అన్నారు. గత రెండు రోజులుగా గ్రామంలో కొత్తగా నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ఏవీ నమోదు కాలేదని ఆమె పేర్కొన్నారు. గ్రామంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, డ్రైనేజీలను శుభ్రపరిచే పనులు, బ్లీచింగ్ పౌడర్ చల్లడం కొనసాగుతోందని, ఫాగింగ్, ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రేయింగ్ వంటి క్రియాశీల చర్యలు గ్రామంలో జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ చెప్పారు.