AP NEWS: పేదలను ఆదుకునే మిషన్ పీ4 – సమాజంలో గేమ్ ఛేంజర్ అవుతుంది
NEW SCHEME LANCHE IN AP
పేదలను ఆదుకునే మిషన్ పీ4 అని, సమాజంలో ఈ కార్యక్రమం గేమ్ ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పీ4 ఒక మహత్తర కార్యక్రమం అని, చరిత్ర సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. అమరావతి రాజధానిలో ఆదివారం పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లోగోను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగువారి తొలి పండుగ ఉగాది రోజున ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుంది. అందుకే పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన పీ4 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచించే పవన్ కళ్యాణ్, భారత్ దేశాన్ని అగ్రదేశంగా మార్చే మోదీతో కలిసి ప్రభుత్వంలో ఉన్నాం. సరైన సమయంలో సరైన వ్యక్తి ప్రధానిగా ఉండటం మన అదృష్టం. నా గురించి నేను ఎక్కడా ఎక్కువగా చెప్పుకోను…కానీ ఇవాళ చెప్తున్నాను. 1978లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను. మరో 3 ఏళ్లు ఉంటే నేను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి 50 ఏళ్లు అవుతుంది. 5 దశాబ్దాలుగా నన్ను ఆదరిస్తున్న మీకే నా జీవితం అంకితం. 9 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు సీఎం అయ్యాను. 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా, 30 ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. దేశంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. అది ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజానీకమే. నా ప్రస్థానాన్ని చూసుకంటే గుండె ఉప్పొంగుతోంది.