AP LATEST NEWS: 2047 నాటికి మురికి వాడల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
2047 నాటికి మన రాష్ట్రం మురికివాడల రహితంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖామాత్యులు పొంగూరు నారాయణ అన్నారు. స్వర్ణాంధ్ర 2047పై నేషనల్ కాన్ఫరెన్స్ లో భాగంగా ఒక రోజు వర్క్ షాపును స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ విజన్ 2047 లో పది సూత్రాల అమలు తో మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలపాలన్నదే ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. 2047 నాటికి దేశం వందేళ్ల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటుందని, ఆ సమయానికి మన రాష్ట్రాన్ని సమగ్రమైన, సమతుల్యమైన అభివృద్ధికి నమూనాగా రూపొందిస్తామన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు విజన్ 2047 ను రూపొందించారని పేర్కొన్నారు. విజన్ 2047 లో కీలక అంశంగా అమరావతి కూడా ఉందన్నారు. అమరావతి ని కేవలం మౌళిక వసతుల ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా నాణ్యమైన జీవన ప్రమాణాలు కలిగి ఉండేలా డిజైన్ చేశామని చెప్పారు. పట్టణాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో అర్బన్ డెవలప్మెంట్ కు నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఆర్థిక వనరుల వినియోగం ద్వారా పట్టణాల అభివృద్ధికి ప్లానర్ లు,ఆర్కిటెక్ట్ లు తమ వంతు సహకారం అందించాలని కోరారు.