AP NEWS: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సుల సేవలు అద్వితీయం – చిత్తశుద్ధి, అంకితభావం, కరుణ, సేవ ల కలయికే నర్సింగ్ వృత్తి
NURSES DAY IN VIJAYAVADA
చిత్తశుద్ధి, కరుణ, సానుభూతి, మానవత్వం, అంకితభావాలు కలగలిపితేనే నర్సులు అని, ఈ వృత్తిని ఎంచుకున్నందుకు అభినందనలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని సోమవారం తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ నర్సెస్ మరియు మిడ్వైవ్స్ కౌన్సిల్ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నర్సింగ్ వృత్తి చాలా పవిత్రమైందని, సేవా భావంతో పనిచేస్తేనే ఆ వృత్తికి న్యాయం చేయగలరని అని అన్నారు. దేశ రక్షణకు సరిహద్దుల్లో సైనికులు ఏవిధంగా పాటుపడతారో నర్సులు కూడా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు తమ సేవలను ఆవిధంగానే అందిస్తున్నారన్నారు. వైద్య రంగంలో పనిచేస్తున్నవారు సైనికులుకన్నా తక్కువేమీ కాదన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా సమయంలో వీరు అందించిన సేవలు ప్రతి ఒక్కరూ గుర్తించుకున్నారన్నారు. రోగులకు చిరునవ్వుతో సేవలందించి వారిని చిరునవ్వుతో ఇంటికి పంపించేలా పనిచేయాలన్నారు. తమ పవిత్ర వృత్తికి న్యాయం చేస్తున్నామా లేదా అనేది ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నర్సుల సేవలు అనితర సాధ్యమైనవని, నర్సులు సంపదను సృష్టిస్తారని దానికి కారణం మనిషి ఆరోగ్యాన్ని సంరక్షించి వారి జీవిత కాలం పెరగడటమేనన్నారు. సమస్యల పట్ల ఉదాసీనంగా ఉంటే ఫిర్యాదులు వస్తాయన్నారు. ప్రజలకు పటిష్టమైన వైద్యం అందించాల్సిన బాధ్యత మంత్రిగా నాపైన, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఉందన్నారు. అందుకోసమే బడ్జెట్ లో వైద్య రంగానికి రూ. 20 వేల కోట్లు కేటాయించారన్నారు. హక్కుల గురించి మాట్లాడుతున్నపుడు బాధ్యతలను కూడా మర్చిపోకూడదన్నారు. ప్రజలకు మేం జవాబుదారీ కాబట్టి బాధ్యతల నిర్వహణపై ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తామని, మానవతా దృక్పధంతో కూడా ఆలోచిస్తామన్నారు. నేను బాధ్యతల గురించి మాట్లాడితే నన్నే ప్రశ్నిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం మానవతా దృక్పధంతో పనిచేస్తుందన్నారు. మా స్థాయిలో మేము సమస్యలు పట్ల సానుకూలంగా ఉంటూ, క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలిస్తున్నా, క్షేత్ర స్థాయికి వెళ్లటంలేదనే విమర్శలు చేస్తున్నారన్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదని వారికి కూడా తెలసుసునన్నారు. ఇటీవల ఒక ఉద్యోగి నన్ను బెదిరిస్తూ నాకు కామెంట్ పెట్టారని, అదే గత ప్రభుత్వం అయితే ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించేదన్నారు. నేను అలా చేయలేదని, కాని మేము అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు.