AP LATEST NEWS: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 4వ SIPB సమావేశం – రూ.1,21,659 కోట్లు పెట్టుబడులకు ఆమోదం
CM CHANDRABABU MEETING ON SIPB
రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వెంటనే గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆమోదం తెలిపిన, ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల పురోగతిపై నిత్యం పరిశీలించాలని… దీని కోసం ట్రాకర్ను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సిఎం ఆదేశించారు. సచివాలయంలో తన అధ్యక్షతన జరిగిన 4వ ఎస్ఐపీబీ సమావేశంలో ముఖ్యమంత్రి రాష్ట్రానికి కొత్తగా వస్తున్న పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించారు. పరిశ్రమలు, విద్యుత్, పర్యాటకం వంటి రంగాల్లో మొత్తం 10 సంస్థలు రూ.1,21,659 కోట్లు పెట్టుబడులు ముందుకురాగా ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 80,104 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. అలాగే, గత మూడు ఎస్ఐపీబీ సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టులు, వాటి పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎఈ పార్క్ చొప్పున మొత్తం 175 నియోజవకర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇందలో భాగంగా మొదట జిల్లాకు ఒకటి చొప్పున 26 జిల్లాల్లో తక్షణం 26 ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికే ప్రతిపాదించిన రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను నెలరోజుల్లోగా రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో 5 సెంటర్లు నెలకొల్పాలని చెప్పారు. పెట్టుబడులు గ్రౌండ్ అయ్యే వరకు ఆయా సంస్థల వెనుకపడాలని…. నిరంతరం ఫాలోఅప్ చేయాలని సిఎం సూచించారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థలకు వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు… క్షేత్ర స్థాయిలో ఆయా ప్రాజెక్టులు పనులు మొదలుపెట్టేలా చూడాలన్నారు. ఈ విషయంలో అటు మంత్రులు, ఇటు అధికారులు మరింత వేగంగా పనిచేయాలని సిఎం సూచించారు. అప్పుడే ప్రతి ఏడాది ప్రగతి, ఫలితం కనిపిస్తుందని సిఎం అభిప్రాయపడ్డారు.