
గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా తీర్చిదిద్దుకోవడానికి నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. గురువారం నగర పాలకసంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజారోగ్య, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు, నోడల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, నగరంలో తప్పని సరిగా డోర్ టు డోర్ చెత్త సేకరణ నూరు శాతం జరగాలన్నారు. పారిశుధ్య పనుల నిర్వహణకు నగరాన్నిమైక్రో పాకెట్స్ గా విభజించామని, పారిశుధ్య పనుల నిర్వహణ పక్కాగా జరిగేలా సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు భాధ్యత తీసుకోవాలన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు కార్యదర్శులు తమ పరిధిలో రోడ్ల మీద చెత్త కుప్పలు లేకుండా, ఖాళీ స్థలాల్లో వ్యర్ధాలు వేయకుండా, డ్రైన్లలో సిల్ట్ ను పూర్తి స్తాయిలో తొలగించుటకు ప్రత్యేక డ్రైవ్ లను ఏర్పాటు చేయాలన్నారు. ఇళ్ల నుండి చెత్తను సేకరించు సమయంలో వ్యర్ధాలను తడి పొడిగా విభజించి సిబ్బందికి అందజేసేలా వారికి అవగాహన కల్గించాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో చెత్తకుప్పలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. ఇళ్లల్లో హోం కంపోస్ట్ తయారు చేసేలా వారికి శిక్షణ ఇవ్వాలని, రీ సైకిల్, రీయూజ్, రెడ్యూస్ (ఆర్ఆర్ఆర్) పై ప్రజలకు అవగాహన కలిగించాలని ప్రజారోగ్యాదికారులను ఆదేశించారు. గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా మార్చుకోవడంలో క్షేత్ర స్తాయిలో నోడల్ అధికారులు కీలకమని, మరింత శ్రద్ధతో అధికారులను, కార్యదర్శులను సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు గుంటూరు నగరంలో పచ్చదనం పెంపు, జంక్షన్లను అభివృద్ధి చేయాలని, వీధి దీపాల నిర్వహణపై ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు. శివారు ప్రాంతాల్లో చెరువుల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సుద్దపల్లి డొంకలోని ఎస్టీపి, పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణలో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. నగరంలో ప్రధాన రహదారుల్లో వాల్ పెయింట్స్ వేయించాలన్నారు. పట్టణ ప్రణాళిక అధికారులు భవన నిర్మాణ వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, నూతన నిర్మాణాలు చేసే యజమానులు గ్రీన్ మ్యాట్ లను వినియోగించేలా చూడాలన్నారు. గుంటూరు నగరాన్నిపోస్టర్ ఫ్రీ సిటీగా చేయాలని, అనధికార బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయకుండా ప్రత్యేక దృష్టి సారించాలని, ఫుట్ పాత్ లు, డ్రైన్లు, రోడ్ల ఆక్రమణలు జరగకుండా పట్టణ ప్రణాళిక అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో అదనపు కమీషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటి కమీషనర్ డి.శ్రీనివాసరావు, సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, నోడల్ అధికారులు, ప్రజారోగ్య, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు పాల్గొన్నారు.








