
గుంటూరు, సెప్టెంబర్ 25: నగరంలో కలుషిత త్రాగు నీరు సరఫరా చేస్తున్న 21 మినరల్ వాటర్ ప్లాంట్లపై జిల్లా అధికారులు బలమైన చర్యలు చేపట్టారు. ప్రజారోగ్యం దృష్ట్యా, ఆయా ప్లాంట్లను సీజ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, నగరంలో ఉన్న 120 మినరల్ వాటర్ ప్లాంట్ల నుంచి త్రాగునీటి శాంపిల్స్ సేకరించి, మంగళగిరిలోని ఐ.పి.యం.పి.హెచ్ ల్యాబ్ మరియు గుంటూరు మెడికల్ కాలేజీలోని రీజినల్ పి.హెచ్ ల్యాబ్లలో పరీక్షించారు. పరీక్షల అనంతరం, 21 ప్లాంట్లలో ఉన్న నీటిలో హానికారక బ్యాక్టీరియా ఉన్నట్లు ల్యాబ్ నివేదికలు వెల్లడించాయి.
ఈ నివేదికలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన అధికారులు, ప్రజారోగ్యానికి హానికరమైన నీటిని విక్రయిస్తున్న ప్లాంట్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారని కలెక్టర్ తెలిపారు. దీంతో, నగర పాలక సంస్థ ప్రజారోగ్య శాఖ సహకారంతో సంబంధిత ప్లాంట్లను సీజ్ చేశారు.
- ఐపిడి కాలనీ: పెరల్స్ ఎంటర్ప్రైజెస్
- నల్లచెరువు: నీల్ డ్రాప్
- శ్రీనివాసరావు తోట: మై ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్, చరణ్ వాటర్
- రెడ్లబజార్: కే.పి.రావు ప్లాంట్
- అంబేద్కర్ నగర్: జె.ఎస్. వాటర్
- బాలాజీ నగర్: ఏకా వారి వీధి ప్లాంట్
- మల్లిఖార్జునపేట: గురుశ్రీ మినరల్ వాటర్
- ఏ.టి.ఆగ్రహారం: బాషా కూల్ డ్రింక్
- శివనగరాజు కాలనీ: వాసవి వాటర్
- నెహ్రునగర్: ఆర్.కే. వాటర్
- స్వాతి అండ్ ఫుడ్, ఎలైన్ ఫ్రెష్ వాటర్, పరమేష్ హోల్సేల్, నరేష్ షాప్, ఉమర్ బాషా ఫ్లేవర్డ్ వాటర్
- యన్.టి.ఆర్ సుజల (పలకరూరు), సరస్వతి కృష్ణ స్టోర్ (హిమని నగర్), స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ (బుడంపాడు)
- మేఘన షాప్ (ఏటుకూరు), 76వ సచివాలయం దగ్గర ప్లాంట్ (లాల్పురం రోడ్)
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి చర్యలు తీసుకోవడం అత్యవసరమని, భవిష్యత్తులో మినరల్ వాటర్ ప్లాంట్లు నిబంధనల మేరకు నడుస్తున్నాయా లేదా అన్నదిపై నిరంతర పరిశీలన జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
“ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవు,” అని ఆమె హెచ్చరించారు.










