“ఒక వాహనం బోల్తా.. 8 మంది మృతి.. గ్రామం కన్నీటిలో..”||”అన్నమయ్యలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది కూలీల దుర్మరణం | Rajampet Lorry Accident | “
Rajampet Lorry Accident | Telugu News"
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా చెరువు కట్ట వద్ద బోల్తా పడటం వల్ల ఏకంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. రైల్వే కోడూరు మండలం శెట్టిపల్లెకు చెందిన 19 మంది కూలీలు, ఇద్దరు చిన్నారులతో కలిసి, అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఇసుకపల్లి నుంచి రైల్వే కోడూరు మార్కెట్ యార్డుకు మామిడికాయల లోడ్ తో వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. లారీ పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్ట వద్దకు రాగానే, డ్రైవర్ ఒకే సారిగా టర్న్ తీసుకోవడం వల్ల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కసారిగా గాడి తప్పిన లారీ కింద పడి, కూలీలు తీవ్రంగా నలిగి మరణించడం గ్రామంలో విషాదాన్ని నింపింది.
లారీలో మొత్తం 22 మంది ఉండగా, 19 మంది శెట్టిపల్లెకు చెందిన కూలీలు, అలాగే ఇద్దరు చిన్నారులు కూడా ఉండటం, ఈ ప్రమాదంలో మరింత బాధాకర అంశంగా మారింది. మృతులలో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్త కూడా ఉండటం గ్రామాన్ని కన్నీళ్లలో ముంచింది. వారి పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయిన దృశ్యం స్థానికులను కలిచివేసింది. ఈ ఘటనతో శెట్టిపల్లె గ్రామంలో ప్రతి ఇంటా ఏడుపే మిగిలింది.
ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ ఎలాంటి గాయాలు పొందకుండా బయటపడగా, గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, మిగతా ఆరుగురు కూలీలు, ఇద్దరు చిన్నారులు రాజంపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను కూడా రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి, పోస్టుమార్టం తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. లారీ కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీయడానికి జేసీబీ సహాయాన్ని తీసుకుని వాహనాన్ని పైకి లాగి క్షతగాత్రులను బయటకు తీసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు, పోలీసుల సమన్వయంతో సహాయ చర్యలు వేగంగా జరగడంతో మరిన్ని ప్రాణనష్టాలు జరగకుండా నిలువరించగలిగారు.
లారీ డ్రైవర్ టర్న్ తీసుకునే సమయంలో వాహనం ఒక్కసారిగా మళ్లించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కూలీలు చెబుతున్నారు. డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. వాహనం ఆగకుండా మళ్లించడం, ప్రమాదం ఉన్న చోట సురక్షితంగా వాహనాన్ని నడపకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రతి రోజూ ఉపాధి కోసం వెళ్లిన పనిలోనే తమ కుటుంబాలను తాకిన ఈ విషాదం.. గ్రామం మొత్తం గుండెలు పిండేసింది. కూలీలు పనిచేసి వచ్చే అట్టల కోసం కుటుంబాలు ఎదురుచూస్తుండగా, మృతదేహాలుగా రావడం కలవరపెట్టే అంశంగా మారింది. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందించాలంటూ గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇది కేవలం ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్ మాత్రమే కాదు.. అనేక కుటుంబాలను రోడ్డున పెట్టిన ఘటన. వాహనాలను సురక్షితంగా నడపడం, డ్రైవర్ల సకాలంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో కీలకం అని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. ఒక చిన్న పొరపాటు, ఒక్కసారిగా తీసుకున్న తప్పుడు మలుపు.. ఒకేసారి ఎనిమిది కుటుంబాలను విషాదంలో ముంచేస్తుంది అని ఈ ఘటన తేటతెల్లం చేసింది.