
గుంటూరులో అనధికారిక లే అవుట్లు, ప్లాట్లు యజమానులు, ప్లాట్ల క్రమబద్దీకరణ పధకం 2020 లో రెగ్యులరైజ్ చేయించుకోకపోతే, వాటికి ప్రభుత్వ సేవలను మరియు రిజిస్ట్రేషన్ నిలిపివేయుతంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో అనధికార లే అవుట్లు మరియు ప్లాట్ల యజమానులు విధిగా యల్.ఆర్.యస్ నందు క్రమబద్దీకరించుకోవాలని, లేకుంటే నగర పాలక సంస్థ అందించే మౌలిక సదుపాయాలైన త్రాగు నీటి సరఫరా, బిల్దింగ్ ప్లాన్ల మంజూరు, భూగర్భ డ్రైన్లు, స్ట్రీట్ లైటింగ్, విద్యుత్ సరఫరా తదితర సేవలు నిలుపుదల చేయుట జరుగుతుందన్నారు. అంతేకాక లే అవుట్ల రిజిస్ట్రేషన్ చేయని భూములను, నిషేదిత భూముల జాబితాలో చేర్చి, రిజిస్ట్రేషన్లు కూడా నిలుపుదల చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే సదరు ప్లాట్లలో అనుమతులు లేని నిర్మాణాలు చేసియున్న యెడల అపరాధరుసుముతో పాటు నిర్మాణాలు తొలగించుటకు చర్యలుంటాయన్నారు. కావున ప్రతి ఒక్కరు యల్.ఆర్.యస్ క్రింద అక్టోబర్ 24 లోపు భూములను క్రమబద్దీకరించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.








