భారతదేశంలో జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) సంస్కరణలు కీలక మార్పులు పొందాయి. సామాన్య ప్రజలకు ఊరట కలిగించేలా పన్ను విధానంలో పునర్వ్యవస్థీకరణకు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు జీఎస్టీలో నాలుగు స్లాబులు ఉండేవి: 5%, 12%, 18%, 28%. ఇప్పుడు 12% మరియు 28% స్లాబులను తొలగించి, కేవలం 5% మరియు 18% స్లాబులను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించారు.
సామాన్యులు వినియోగించే హెయిర్ ఆయిల్, సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్లు, టూత్ పేస్టులు, టేబుల్వేర్, కిచెన్వేర్ వంటి గృహావసర వస్తువులపై జీఎస్టీని 5%కి తగ్గించారు. అలాగే, ఆల్ట్రా హైటెంపరేచర్ పాలు, పన్నీరు, అన్ని రకాల భారతీయ రొట్టెలపై పన్ను మినహాయింపు ఇస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. గతంలో 12% మరియు 18% పన్ను స్లాబుల్లో ఉన్న నమ్కీన్, బుజియా, సాస్లు, పాస్తా, ఇనిస్టెంట్ నూడిల్స్ వంటి వాటిని 5% స్లాబ్లోకి తీసుకొచ్చారు.
వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లు, హార్టీకల్చర్ యంత్రాలు, కల్టివేటర్లు, హార్వెస్టర్లు, త్రెషర్లు, హేమూవర్లపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు. 12 రకాల సేంద్రీయ పురుగుల మందులపై పన్నును 12% నుంచి 5%కి కుదించారు. వ్యవసాయ రంగానికి చాలా కీలకమైన సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, అమోనియాపై జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించారు.
ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసింది జీఎస్టీ కౌన్సిల్. 33 రకాల ఔషధాలపై పూర్తిగా పన్ను మినహాయిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్తో పాటు అరుదైన జబ్బుల చికిత్సలో ఉపయోగించే మూడు ఔషధాలపై కూడా జీఎస్టీని పూర్తిగా మినహాయించారు.
సిమెంట్పై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. సొంతిల్లు కట్టుకునే మధ్యతరగతికి ఊరట కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. చేతి వృత్తులు, కార్మికులు తయారు చేసే మార్బుల్ బ్లాక్లు, మధ్యంత చర్మ వస్తువులపై పన్ను 12% నుంచి 5%కి తగ్గించారు.
చేనేత రంగానికి సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ సమస్యను పరిష్కరించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు.
ACలు, అన్ని రకాల TVలు, డిష్ వాషింగ్ మెషీన్లు, చిన్న కార్లు, 350 CC కంటే తక్కువ సామర్థ్యం గల మోటార్ సైకిళ్లు 18% స్లాబ్లోకి రానున్నాయి. పునరుత్పాదక ఇంధన రంగానికి చెందిన వస్తువులపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు. బయోగ్యాస్ ప్లాంట్లు, విండ్మిల్స్, విండ్ ఆపరేటెడ్ ఎలక్ట్రిసిటీ జనరేటర్లు, ఫొటోవాల్టెక్ సెల్స్, సోలార్ కుక్కర్లు, సోలార్ వాటర్ హీటర్లపై పన్ను తగ్గనుంది.
జీఎస్టీని రెండు స్లాబులకు కుదించినా, అత్యంత విలాస వస్తువులపై ఏకంగా 40% పన్ను విధించేలా నిర్ణయం తీసుకుంది కౌన్సిల్. పాన్ మసాలా, సిగరెట్లు, గుట్కా, జర్దా, పొగాకు, బీడీలకు వర్తిస్తుందన్నారు. కూల్డ్రింక్స్కి కూడా 40% శ్లాబు కిందకు వస్తాయి. పెద్ద కార్లు, 350 CC కంటే ఎక్కువ సామర్థ్యం గల మోటార్ సైకిళ్లు, వ్యక్తిగత అవసరాల కోసం కొనుగోలు చేసే హెలికాప్టర్లు, విమానాలు, క్రీడా అవసరాలకు వినియోగించే అన్ని రకాల పడవలకు 40% శ్లాబ్ వర్తిస్తుంది.
సామాన్యుడిపై భారం తగ్గించే దిశగా జీఎస్టీ కౌన్సిల్ సమష్టి నిర్ణయం తీసుకుందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారన్నారు. సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు