పల్నాడు జిల్లా చిలకలూరిపేట
రోడ్డు భద్రతా నియమాలు ఉన్నది మన ప్రాణ రక్షణ కోసమేననే వాస్తవాన్ని వాహనదారులు తెలుసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. సోమవారం ఆయన పట్టణంలోని ఎన్ ఆర్టీ సెంటర్లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలను విధిగా పాటించాలని, ముఖ్యంగా యువత ట్రాఫిక్ రూల్స్ ను నిర్లక్ష్యం చేయడం ఎంత మాత్రం మంచిది కాదని చెప్పారు. రోడ్డు భద్రతకు సంబంధించిన నిబంధనలు విస్మరించడం అంటే, కోరి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే అవుతుందని మాజీమంత్రి స్పష్టంచేశారు. రోడ్డు పైకి వచ్చి, క్షేమంగా ఇంటికి వెళ్లేవరకు ప్రతి ఒక్కరూ తమ కుటుంబాల గురించి ఆలోచించాలని ఆయన హితవు పలికారు. వాహనదారుల భద్రత, క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొనే, గత ప్రభత్వం గాలికి వదిలేసిన రోడ్ల నిర్మాణం, మరమ్మతులను చంద్రబాబు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టిందని మాజీమంత్రి తెలియచేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా, భద్రతా నిబంధనలు ప్రజలకు తెలియచేస్తూ ర్యాలీ నిర్వహించిన ఆటో, జీప్ డ్రైవర్లను పుల్లారావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కేఎల్.రావు, సిబ్బంది, పార్టీ నాయకులు నెల్లూరి సదా శివరావు, పఠాన్ సమాద్ ఖాన్, జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, యస్. యస్.సుభాని, మద్దూమలా రవి, తదితరులు పాల్గొన్నారు