గుంటూరు, 17 సెప్టెంబరు 2025:-బుధవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ మినీ సమావేశమందిరంలో కేంద్ర గ్రామీణాభివృధ్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ , సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులతో కలసి వ్యవసాయశాఖ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రైతులకు యూరియా పంపిణీ, భూసార పరీక్షలు, ఈ – క్రాప్ బుకింగ్, ఫసల్ బీమా యోజన పథకం తదితర అంశాలపై కేంద్రమంత్రి వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి సూచనలు అందించారు.సమావేశం అనంతరం కేంద్ర గ్రామీణాభివృధ్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో యూరియా ఇబ్బందులు లేకుండా సక్రమంగా రైతులకు సరఫరా జరుగుతుందన్నారు. ఖరీఫ్ సీజన్లో యూరియా 24 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే దానికంటే అదనంగా ఇప్పటికే 26,000 మెట్రిక్ టన్నులను రైతులకు సరఫరా చేయడం జరిగిందన్నారు. అధిక వర్షాలు, యూరియా సరఫరా పై ఉన్న అపోహలతో కొంతమంది రైతులు అవసరానికి మించి ముందస్తుగా యూరియాను నిల్వ చేసుకున్నట్లు తెలిసిందన్నారు. ప్రస్తుతము యూరియా అందుబాటులో ఉందని, మరికొంత యూరియా జిల్లాకు వస్తుందన్నారు. రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా యూరియా సరఫరా కోసం ఆఫ్ సీజన్లో నే మార్క్ ఫెడ్ ద్వారా యూరియా కొనుగోలుకు చర్యలు తీసుకుంటామన్నారు. వాస్తవంగా పంటలు సాగు చేస్తున్న భూ యజమానులకు, కౌలు రైతులకు మాత్రమే యూరియా పంపిణీ జరిగేలా కేంద్ర ప్రభుత్వ యాప్ లో ఓటిపి విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ,రాష్ట్ర వ్యవసాయ అధికారులతో చర్చించడం జరుగుతుందన్నారు. జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు 13వేల భూసార పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. భూసార పరీక్షల నిర్వహణ , ఫలితాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని రైతులు తెలియజేశారని, గ్రామస్థాయిలోనే భూసార పరీక్షలు నిర్వహించి వెంటనే ఫలితాలు అందించేందుకు అవసరమైన పరికరాల కొనుగోలుకు నేషనల్ సాయిల్ హెల్త్ మిషన్ అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ -క్రాప్ బుకింగ్ ఇప్పటి వరకు 58 శాతం మాత్రమే పూర్తయిందని నూరు శాతం ఈక్రాప్ బుకింగ్ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టర్ కు సూచించడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద జిల్లాలో పంటల సాగు చేస్తున్న వారిలో దాదాపు 10 శాతం మంది మాత్రమే నమోదు కావడం జరిగిందన్నారు. బీమా నమోదుకు సంబంధించి రైతులు,బ్యాంకర్ల వద్ద రుణాలు తీసుకునే సమయంలో, ఈ-క్రాప్ బుకింగ్ లో సాగుచేసిన పంట నమోదులో వివరాలు సరిపోకపోవడం తదితర సమస్యల వలన ఎక్కువమంది ప్రధానమంత్రి ఫసల్ బీమా లో నమోదు కావడం లేదన్నారు. ప్రకృతి విపత్తుల సంభవించినప్పుడు బీమా లో నమోదైతే నష్టపరిహారం పొందవచ్చని రైతులందరికీ అవగాహన కల్పించి ప్రధానమంత్రి ఫసల్ బీమా లో నమోదయ్యేలా వ్యవసాయ అధికారులు జిల్లాలో వ్యవసాయ శాఖ కు సంబంధించి సమీక్షించిన అంశాలపై ఉన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తో పాటు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ యూరియా సమస్యలు ఉన్నాయన్న వార్త కథనాలపై స్పందిస్తూ వ్యవసాయ అధికారులతో కేంద్రమంత్రి సమీక్ష నిర్వహించారన్నారు. అయితే యూరియా కొరత అనేది కేవలం ఊహాజనితం మాత్రమే అని తెలిపారు. లక్ష్యానికి మించి 2000 మెట్రిక్ టన్నులు అధికంగా గుంటూరు జిల్లాలో యూరియా సప్లై జరిగిందని, యూరియా కొరత లేదన్నారు.సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అయితా నాగేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, మార్కెఫెడ్ డీఎం నరిసింహా రెడ్డి, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజరు హరిగోపాలం, జిల్లా ఉద్యానశాఖ అధికారి రవీంద్రబాబు, ఏపీఎంఐపీ పీడీ వజ్రశ్రీ, పశుసంవర్ధకశాఖ డీడీ సత్యన్నారాయణ, లీడ్ బ్యాంకు మేనేజర్ మహిపాల్ రెడ్డి, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
207 2 minutes read