
అమరావతి, సెప్టెంబర్ 25:రాష్ట్రంలో ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ నిర్వహణ తప్పనిసరిగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయం సమీపంలో జరిగిన మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 15,941 మంది కొత్త ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేశారు.

“బాబు ష్యూరిటీ… జాబు గ్యారెంటీ” అనే నినాదాన్ని వాస్తవంగా అమలు చేస్తున్నాం. నియామకాల్లో పూర్తి పారదర్శకత పాటించాం,” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
డీఎస్సీపై తొలి సంతకం
సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశానని గుర్తు చేసిన చంద్రబాబు, 150 రోజుల్లో డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని బృందాన్ని ప్రశంసించారు. ఇకపై డీఎస్సీ నిర్వహణకు ప్రత్యేక అనుమతులు అవసరం ఉండబోవని స్పష్టం చేశారు.
మహిళలే ఉత్తమ ఉపాధ్యాయులు
విద్యా రంగంలో మహిళల పాత్రపై ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించారు.
“ఇంటిని నిర్మించడంలోనూ, సమాజాన్ని తీర్చిదిద్దడంలోనూ మహిళలే ముందుంటారు. చదువు చెప్పడంలోనూ మహిళలే బెస్ట్,” అని అన్నారు.
వైద్య, ఆరోగ్య, విద్య రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
విద్య రంగానికి అధిక ప్రాధాన్యం
తాను తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నానని సీఎం తెలిపారు. గత 15 ఏళ్లలో 14 సార్లు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని, దాంతో 1,96,619 ఉద్యోగాలు కల్పించామని వివరించారు.
“రాష్ట్రంలోని మిగిలిన ముఖ్యమంత్రులందరూ కలిపి ఇచ్చిన టీచర్ ఉద్యోగాల కంటే నేనే ఎక్కువగా ఇచ్చాను,” అని గర్వంగా వెల్లడించారు.
విలువలతో కూడిన విద్యపై ముఖ్యమంత్రి దృష్టి
బహుముఖ ప్రతిభ కలిగిన విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పిల్లల్లో నైతిక విలువలు, నైపుణ్యాలను పెంపొందించే విధంగా పాఠాలు చెప్పాలని సూచించారు.
“నిత్యం నేర్చుకోవడంలో నేనూ విద్యార్థినే. కొత్త విషయాలు తెలుసుకోవడం ద్వారా ప్రజలకు ఉపయోగపడే మార్గాలను అన్వేషిస్తా,” అని సీఎం అన్నారు.
విపక్షాలపై తీవ్ర విమర్శలు
డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు కొన్ని విపక్షాలు దుష్ప్రచారాలు చేశాయని చంద్రబాబు ఆరోపించారు.
“ఏపీలో ఓ చేతకాని పక్షం ఉంది. మంచి చేయదు. మంచి జరుగుతుంటే ఓర్చి చూడలేరు. డీఎస్సీపై 106 కేసులు వేసినప్పటికీ, అవన్నీ అధిగమించి నియామకాలను పూర్తి చేశాం,” అని ఘాటుగా స్పందించారు.
2019-24 మధ్యకాలం విద్యా రంగానికి శాపంగా మారిందని పేర్కొన్నారు. ఆ సమయంలో 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిపోవాల్సి వచ్చిందని విమర్శించారు.
లోకేష్కు సీఎం అభినందనలు
విద్యా రంగంలో వినూత్న మార్పులు తీసుకువస్తున్న నారా లోకేష్ ను ముఖ్యమంత్రి ప్రశంసించారు.
“నో బ్యాగ్ డే విధానం, పేరెంట్-టీచర్ మీటింగులు, స్కూల్ కిట్ల పంపిణీ వంటి కార్యక్రమాలు విద్యా రంగాన్ని మెరుగుపరుస్తున్నాయి,” అని అన్నారు.
ముఖాముఖి కార్యక్రమంలో టీచర్లతో భేటీ
ఈ కార్యక్రమంలో సీఎం ప్రత్యేకంగా కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తనను రాజకీయాల్లోకి ప్రేరేపించిన డీఎల్ నారాయణ అనే ఎకనామిక్స్ ప్రొఫెసర్ను గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల్లోని నైపుణ్యాలను గుర్తించి, వారి జీవితాలను మారుస్తే సమాజానికి మంచి చేయగలమని సీఎం అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.










