
గుంటూరు, అక్టోబర్ 10:పెదనందిపాడు మండలంలోని అనుపర్రు బీసీ బాలుర వసతి గృహంలో ఇటీవల అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా నిలకడగా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు.

శుక్రవారం రోజున గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి ఎస్. సవిత, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కలిసి పరామర్శించారు. పిల్లల వార్డులో విద్యార్థులతో మాట్లాడిన మంత్రి, వారి ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందించిన సమాచారం మేరకు విద్యార్థుల ఆరోగ్యం మెల్లగా మెరుగుపడుతోందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత విలేకరులతో మాట్లాడుతూ, “అనుపర్రు వసతి గృహంలో మొత్తం 108 మంది విద్యార్థులు ఉన్నారు. శుక్రవారం నాడు వీరిలో 56 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు స్పందించి ప్రాథమిక చికిత్స అందించారు. జ్వరం ఉన్న 16 మందిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కొంతమందిని ఇప్పటికే డిశ్చార్జి చేశాం,” అని తెలిపారు.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ శోచనీయంగా ఉన్నదని విమర్శించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన భోజనం, ఉత్తమ విద్య అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
ఇటు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ, గురువారం రాత్రి భోజనం లేదా నీటి కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు. అస్వస్థతకు గురైన వెంటనే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, స్థానికంగా ఉన్న ఏసీ కళ్యాణ మండపంలో ప్రాథమిక వైద్యం అందించారని వివరించారు. 18 మందిని జీజీహెచ్కు తరలించారని తెలిపారు.
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్వయంగా సంఘటన స్థలానికి చేరుకొని, వైద్యశాఖను తక్షణమే అప్రమత్తం చేయగా, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి. రమణ నేతృత్వంలో మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు, బీసీ వెల్ఫేర్ ఎక్స్ అఫిషియో సెక్రటరీ ఎస్. సత్యనారాయణ, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు










