
బాపట్ల జిల్లా:చీరాల:13 10 25:బాపట్ల జిల్లాలోని చీరాల ఓడరేవు బీచ్ లో ఆదివారం సాయంత్రం దారుణ ఘటన చోటు చేసుకుంది. సముద్ర స్నానం కోసం వచ్చిన ఐదుగురు యువకులు ఎగసిపడిన అలల ధాటికి గల్లంతయ్యారు. ఈ సంఘటనతో బీచ్ పరిసరాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలు ఒడ్డుకు తేలాయి. మిగిలిన ఇద్దరి కోసం మత్స్యకారులు, మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
మృతుల వివరాలు ఇలా:
- సాయి మణి దీప్,
- జీవన్ సాత్విక్ (జడ్చర్ల, హైదరాబాద్),
- శ్రీ సాకేత్ — వీరంతా హైదరాబాద్కు చెందినవారు మరియు వీవీఐటికి చెందిన విద్యార్థులుగా గుర్తింపు పొందారు.
- కుచన షారోను (22 సం॥), తండ్రి వసంత్ రావు
- కోట గౌతమ్ (16 సం॥), తండ్రి ప్రసాద్ — ఈ ఇద్దరు చీరాల మండలం కొత్తపేట వడ్డే సంఘానికి చెందినవారు.
ప్రభుత్వం స్పందన:
విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్., సంఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. “ఈ దుర్ఘటన చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాం,” అని కలెక్టర్ స్పష్టం చేశారు.అగ్నిమాపక, మత్స్య మరియు పోలీసు శాఖల అధికారులు సంఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగారు. ప్రస్తుతం మిగిలిన మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
వారాంతపు విహారం.. విషాదంలో ముగిసింది
ఆదివారం సెలవు దినం కావడంతో ఓదార్పు కోసం బీచ్ కి వచ్చిన యువకుల ప్రాణాలు సముద్రంలో కలిసిపోవడం పట్ల స్థానికులు, పర్యాటకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.







