
గుంటూరు నగరంలో అభివృద్ధి, పారిశుధ్య పనులు పిన్ పాయింట్ ప్రకారం జరగాలని, ఎక్కడా నిర్లక్ష్యంగా ఉండడానికి వీలు లేదని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ దుర్గా నగర్, ఐపిడి కాలనీ ప్రాంతాల్లో పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డ్ ల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువు మేరకు జరిగేలా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత లేకుంటే సంబందిత ఎమినిటి కార్యదర్శి, ఏఈలే భాద్యత వహించాలని స్పష్టం చేశారు. అనంతరం ఐపిడి కాలనీలో పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి, ఎక్కడా డంపింగ్ పాయింట్లను లేకుండా ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ నూరు శాతం జరగాలన్నారు. కమర్షియల్ సంస్థలు వ్యర్ధాలను రోడ్లు, డ్రైన్లలో వేస్తె కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇవ్వాలని, అవసరైమతే భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని ఆదేశించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి ఇంటి నుండి వచ్చే వ్యర్ధాలను తడిపొడిగా విభజన చేసి ఇవ్వాలని తెలిపారు.పర్యటనలో ఈఈ విష్ణు, డిఈఈ శ్రీనివాస్, ఎస్ఎస్ ఆయూబ్ ఖాన్, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.







