
గుంటూరు, నవంబర్ 7 :-రైతు సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రధాన ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరులో నిర్వహించిన ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన, “అన్నదాతకు అండగా ఉండటానికి ఎన్జీ రంగానే మాకు స్పూర్తి” అని పేర్కొన్నారు.“రైతు బాంధవుడిగా ఎన్జీ రంగా అందరికీ ఆదర్శం. గత పాలకులు రైతులను రోడ్డున పడేశారు, పంటల బీమా సొమ్ము కూడా ఎగ్గొట్టారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఏ రైతూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ధాన్యం కొన్న 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం,” అని సీఎం తెలిపారు.వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన రోజునే ఆచార్య రంగా జయంతి జరుపుకోవడం విశేషమని ఆయన అన్నారు. “రంగా జీవితం స్వాతంత్ర్య పోరాటం, రైతు సంక్షేమం కోసం అంకితం అయింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదివినా ఆయన జీవితమంతా రైతు కోసం కృషి చేశారు,” అని చంద్రబాబు గుర్తుచేశారు.

ఎన్జీ రంగాతో ప్రత్యేక అనుబంధం
తనకు ఎన్జీ రంగాతో ప్రత్యేక అనుబంధం ఉందని సీఎం తెలిపారు. “ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వర్సిటీకి కూడా ఆయన పేరు పెట్టాం. రూరల్ డెవలప్మెంట్పై పీహెచ్డీ చేయాలనుకున్నప్పుడు రంగా రచనలు నాలో స్పూర్తినిచ్చాయి. ఆయన 33 ఏళ్ల వయసులోనే రైతాంగ ఉద్యమాన్ని నడిపారు. రైతుల భూములను రక్షించే చట్టాలను ఆపిన ఘనత ఆయనదే. పార్లమెంటులో 50 ఏళ్ల సేవలకు గాను గిన్నిస్ బుక్లో చోటు దక్కడం గర్వకారణం” అని అన్నారు.
రైతు సంక్షేమం మా ప్రాధాన్యం
తెలుగుదేశం ఎప్పుడూ అధికారంలో ఉన్నా రైతుల కోసం కృషి చేస్తుందని సీఎం తెలిపారు. “రైతుకు ఆదాయం పెరగాలంటే ఉత్పత్తి పెరిగి ఖర్చు తగ్గాలి. 2014-19 మధ్య వ్యవసాయ రంగం జీడీపీ 16.6% వృద్ధిని సాధించగా, గత ఐదేళ్లలో అది 10%కి పడిపోయింది. ఇప్పుడు మేము దాన్ని 15.45%కు పెంచాం,” అని వివరించారు.రబీ సీజన్లో రైతులకు బకాయిలను క్లియర్ చేశామని తెలిపారు. “55.79 లక్షల టన్నుల ధాన్యాన్ని రూ.12,857 కోట్లకు కొనుగోలు చేశాం. 8 లక్షల మంది రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే డబ్బు జమ చేశాం. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.7 వేల చొప్పున సాయం అందించాం,” అని చెప్పారు.

పంట బీమా, గిట్టుబాటు ధరల్లో విప్లవాత్మక మార్పులు
“మూడేళ్లపాటు పంట బీమా ఎగ్గొట్టిన గత పాలకుల బదులు, మా ప్రభుత్వం అధికారం లోకి రాగానే 95% బీమా చెల్లించింది. మామిడికి రూ.240 కోట్లు, పొగాకుకు రూ.273 కోట్లు, కోకోకు రూ.14 కోట్లు, కాఫీ రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున సాయం అందించాం. ఉల్లి, టమాటా, మిరప పంటలకు రూ.240 కోట్లకుపైగా వ్యయం చేశాం,” అని సీఎం వివరించారు.
నీటి భద్రత, సేంద్రీయ వ్యవసాయం పై దృష్టి
సమర్థ నీటి నిర్వహణతో రిజర్వాయర్లు 95% నిండాయని సీఎం తెలిపారు. “గత ప్రభుత్వం గేట్లను కూడా నిర్వహించలేకపోయింది. ఇప్పుడు రాయలసీమలో కరువును జయించాం. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీతో రైతులకు మేలు కలిగిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% సబ్సిడీ, ఇతరులకు 50–90% సబ్సిడీ ఇస్తున్నాం,” అని చెప్పారు.రైతులు అధైర్యపడకుండా పంటల మార్పిడి చేయాలని, సేంద్రీయ ఎరువుల వినియోగంపై దృష్టి పెట్టాలని సూచించారు. “రసాయన ఎరువుల కారణంగా కొన్ని దేశాలు మన పంటలను దిగుమతి చేసుకోవడాన్ని నిరాకరిస్తున్నాయి. అందుకే సేంద్రీయ వ్యవసాయం తప్పనిసరి,” అని చంద్రబాబు పేర్కొన్నారు.

తరువాత “ఆధునిక రాజ్యాంగ సంస్థలు” అనే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కె.అచ్చెన్నాయుడు, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు, వ్యవసాయ శాఖ నిపుణులు తదితరులు హాజరయ్యారు.










