
బాపట్ల: 21-11-2025:-అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగింది. “ప్రతి బిడ్డకు–ప్రతి హక్కు” అనే అంశంపై జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జ్యోతివెలిగించి ప్రారంభించారు. విద్యార్థినులు అందించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బాల్యవివాహాలను అడ్డుకున్న అంగన్వాడీ కార్యకర్తలకు బహుమతులు అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…బాల్యవివాహాలు రాష్ట్ర అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారాయని, వాటిని నిర్మూలించేందుకు విద్యార్థినిలు, యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు సామాజిక అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. “దేశ రాజ్యాంగం మనకు స్వేచ్ఛగా జీవించే హక్కును ఇచ్చింది. ఆ హక్కులపై అవగాహన పెరిగినప్పుడు మాత్రమే సమాజం ముందుకు సాగుతుంది” అని కలెక్టర్ అన్నారు.

18 ఏళ్లు పూర్తయ్యాకే వివాహం చేసుకోవడం యువత భవిష్యత్తుకు ఎంతో మంచిదని సూచించారు. తాను కూడా ప్రభుత్వ వసతి గృహంలో చదివి, కష్టపడి ఈ స్థాయికి వచ్చానని విద్యార్థినులతో మధురానుభూతులను పంచుకున్నారు. “మీ తల్లిదండ్రులు మీకు స్పూర్తి… చదువుతో ముందుకు సాగితే మీరు కూడా ఉన్నత స్థానాల్లో నిలవగలరు” అని ఉద్బోధించారు.మహిళా శిశు సంక్షేమశాఖ పీడీ రాధామాధవి మాట్లాడుతూ…
బాలల హక్కుల పరిరక్షణలో శాఖ కట్టుబడి పనిచేస్తోందని, చదువు ద్వారానే పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగగలరని తెలిపారు.కార్యక్రమంలో డీఈఓ పురుషోత్తం, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారిణి రాజదిబోరా, వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్.విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.










