
గుంటూరు: నవంబర్ 21:-జిల్లాలో మత్స్య సంపదను పెంపొందిస్తూ, మత్స్యకారుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు.ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తాడేపల్లి మండలం పడల రేవు వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, ప్రకాశం బ్యారేజ్ జలాశయంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో కలిసి 23,50,000 చేప పిల్లలను నీటిలో విడుదల చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన 2047 స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్లో వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధకంతో పాటు మత్స్యరంగానికి ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. విత్తనం నుండి మార్కెటింగ్ వరకు మత్స్యకారుల అభివృద్ధికి అవసరమైన సహాయాలను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు.

జిల్లాలో పెద్దఎత్తున ఇన్ల్యాండ్ మత్స్యకారులు ఉన్నారని, ప్రకాశం బ్యారేజ్తో పాటు నాలుగు మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో మత్స్య సంపదను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాలోని 202 గ్రామాల చెరువుల్లో కూడా చేపల సంపద పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు.ప్రస్తుత కాలంలో ప్రజల ఆహార పద్ధతుల్లో మార్పు వచ్చి ప్రోటీన్తో నిండిన ఆహారానికి డిమాండ్ పెరిగిందని, రానున్న రోజుల్లో ఫిషరీస్, ఆక్వా ఉత్పత్తులకు మరింత అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తులు సాగుచేసే దిశగా మత్స్యకారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

మత్స్యకారులందరూ AP-SADAలో తప్పనిసరిగా నమోదు కావాలని, ప్రధాని మత్స్య సంపద యోజన పథకం ద్వారా మార్కెటింగ్ సౌకర్యాల కోసం ఫిష్ వెండింగ్ యూనిట్లు అందిస్తున్నట్లు తెలిపారు. లక్ష్యాల మేరకు గ్రౌండింగ్ వేగవంతం చేయాలని మత్స్యశాఖ అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా జిల్లాలోని ఆరు మత్స్యకారుల సహకార సంఘాలకు రూ. 10,11,978 విలువైన నూరుశాతం రాయితీ చెక్కులు కలెక్టర్, సబ్ కలెక్టర్ సంజనా సింహాతో కలిసి అందజేశారు.గుంటూరు వెన్లాక్ మార్కెట్లో చేపలు విక్రయిస్తున్న మహిళా మత్స్యకారులు కనీస సౌకర్యాల లేమిపై కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సమస్యలను పరిశీలించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి కిరణ్, జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు భూశంకర్, ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరి, ఎంపీటీసీ శివకుమారి, ఎంపీపీ కృష్ణ, తహసిల్దారు సీతారామయ్య సహా పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.










