
Guntur:తాడేపల్లి:నవంబర్ 21:-అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పిలుపునిచ్చారు. శుక్రవారం తాడేపల్లి మండలంలోని పెనుమాకలో 3, 7 అంగన్వాడీ కేంద్రాలను ఆమె ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.కేంద్రాల పరిధిలో 6 ఏళ్ల లోపు తక్కువ బరువున్న పిల్లలకు పౌష్టికాహారం అందించే చర్యలు తీసుకోవాలని సీడీపీఓకు ఆమె సూచించారు. సిబ్బంది, పిల్లలు, వారి తల్లులతో మాట్లాడిన ఆమె, కేంద్రాల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

చిన్నారుల బరువు–ఎత్తు పరిశీలనను క్రమం తప్పకుండా నిర్వహించాలని, తక్కువ బరువున్న పిల్లలను ఎన్ఆర్సీ కేంద్రాల్లో 15 రోజుల పాటు ఉంచి పౌష్టికాహారం అందించాలని ఆమె ఆదేశించారు. స్కూలుకు వెళ్లే పిల్లలకు హెచ్బీ పరీక్షలు చేయించి రక్తహీనత ఉంటే ఐరన్ సప్లిమెంట్లు ఇవ్వాలని సూచించారు. ఏఎన్ఎంలతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కూడా చెప్పారు.స్కూల్ డ్రాపౌట్లను గుర్తించి, వారి తల్లిదండ్రులతో చర్చించి పాఠశాలకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటింటి సందర్శనల్లో తల్లిబిడ్డల ఆరోగ్యంపై అవగాహన కల్పించి, పౌష్టికాహారం, మందులు తీసుకునేలా చూడాలని ఆమె సూచించారు. కేంద్రాల్లో పౌష్టికాహారం అందించే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన ఆమె, పిల్లలతో మమేకమై ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్నారు.పిల్లల రిజిస్టర్ నమోదు, హాజరు వివరాలను తనిఖీ చేసిన డాక్టర్ శైలజ, టాయిలెట్స్ను శానిటైజ్ చేయడం, ప్రీ గార్డెన్ అభివృద్ధి చేయడం వంటి సూచనలు సిబ్బందికి అందించారు.ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ అడ్వైజర్ రావూరి సూయజ్, సెక్షన్ ఆఫీసర్ శైలజ, మంగళగిరి సీడీపీఓ సరిత, ఏసీడీపీఓ సౌమ్య, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.







