
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలకు ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అవసరమైన అన్ని ఏర్పాట్లు పటిష్ట ప్రణాళిక ప్రకారం చేపడుతున్నామని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లోని డీఆర్సి సమావేశ మందిరంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల ఏర్పాట్ల పై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 3వ తేదిన జారీ చేసి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించటం జరిగిందన్నారు. నామినేషన్లు ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం 03.00 గంటల వరకు స్వీకరిస్తారని, నామినేషన్లు ఫిబ్రవరి 10వ తేదీ వరకు స్వీకరించటం జరుగుతుందన్నారు. ప్రభుత్వ శెలవు దినాల్లో రెండవ శనివారం (08-02-20225), ఆదివారం (09.02.2025) నామినేషన్లు స్వీకరించరని, సోమవారం నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు అన్నారు. మంగళవారం నాటికి ఒక్క అభ్యర్ధి నామినేషన్ వేశారన్నారు. ఫిబ్రవరి 11వ తేది అభ్యర్ధులు అందించిన నామినేషన్ల స్క్రూటీని జరగుతుందని, నామినేషన్ల ఉప సంహరణకు ఫిబ్రవరి 13వ తేది సాయంత్రం 3.00 గంటల వరకు సమయం ఉంటుందన్నారు. ఉప సంహరణ సమయం ముగిసిన రోజే పోటీలో ఉన్న అభ్యర్ధుల తుది జాబితా ప్రకటించటం జరుగుతుందన్నారు. పోలింగ్ ఫిబ్రవరి 27వ తేది ఉదయం 08.00 గంటల నుంచి సాయంత్రం 04.00 గంటల వరకు జరుగుతుందని, ఓట్ల లెక్కింపు మార్చి 3 వ తేది జరుగుతుందన్నారు. శాసనమండలి ఎన్నికలు బ్యాలేట్ పేపరు, ప్రాధాన్యత ఓటు విధానం లో జరుగుతున్నందున ఓట్ల లెక్కింపు రెండు నుంచి మూడు రోజులు జరిగే అవకాశం ఉందని, మార్చి 8 వ తేది నాటికి ఓట్ల లెక్కింపు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిందన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల పరిధి గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు పూర్తిగా ఏలూరు, బాపట్ల జిల్లాలలో కొంత భాగం ఉందన్నారు. ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా గుంటూరు జిల్లా కలెక్టర్ ఉంటారని, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల జిల్లా రెవెన్యూ అదికారులు, ఏలూరు జిల్లా పోలవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను నియమించటం జరిగిందన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు జనవరి 30వ తేది నాటికి ఓటర్లు పురుషులు 2,06,176 , మహిళలు 1,40,307 , ట్రాన్స్ జెండర్స్ 46 మంది మొత్తం 3,46,529 మంది ఉన్నారన్నారు. జనవరి 31వ తేది వరకు ఓటరు నమోదుకు ధరఖాస్తులు స్వీకరించటం జరిగిందని, ధరఖాస్తులను ఫిబ్రవరి 10వ తేది నాటికి పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రకటించటం జరుగుతుందన్నారు. ఓటరు నమోదుకు ధరఖాస్తు చేసుకోవటానికి సమయం ముగిసినందుకు నూతన ఓటు నమోదుకు, సవరణలకు, తొలగించటానికి ధరఖాస్తులు స్వీకరించటం కుదరదన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు 416 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఓటర్లు ఎక్కువుగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు 67 యాగ్జిలరీ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు అందించటం జరిగిందని, అనుమతులు మంజూరు చేస్తే 483 పోలింగ్ కేంద్రాలు ఉంటాయన్నారు. సాధారణ ఎన్నికల తరహాలోనే శాసనమండలి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందన్నారు. పట్టభద్రులను ప్రభావితం చేసే ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించరాదన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పర్యవేక్షణకు మండలానికి ఒకటి, నగరాల్లో జనాభాకు అనుగుణంగా మూడు నుంచి నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. గుంటూరు జిల్లాలో 23 ప్లైయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఓటర్లకు నగదు పంపిణీ చేయటం, ప్రలోభాలకు గురిచేయటం, బెదరించటం వంటి కార్యక్రమాలను చేస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్ధులకు వ్యయ పరిమితిపై నిబంధనలు లేవని అందువలన ప్రత్యేకంగా ఖర్చుల పర్యవేక్షణకు బృందాలు ఉండరన్నారు. సాధారణ ఎన్నికల తరహాలోనే ప్రచారానికి సంబంధించి సమావేశాలు, ర్యాలీలకు ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. సంబంధిత జిల్లాలలోని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులే అనుమతులు మంజూరు చేస్తారన్నారు. సింగిల్ విండో ద్వారా ధరఖాస్తు చేసుకుంటే అనుమతులు మంజూరు చేస్తారన్నారు. టీవీ, రేడియో, ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రచార కంటెంట్ కు సంబంధించి ఎంసీఎంసీ కమిటీ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ముగ్గురు పోలింగ్ అధికారులతో పాటు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారన్నారు. దీనికి సంబంధించి అవసరమైన ఉద్యోగులు, సిబ్బంది వివరాలను సిద్ధం చేయటం జరిగిందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వీడియో గ్రాఫర్, వెబ్ కాస్టింగ్, మెక్రో అబ్జర్వర్ నియమించటం జరిగిందన్నారు. పోలింగ్ కు అవసరమైన మెటీరియల్ సిధ్దం చేయటానికి ఇప్పటికే నోడల్ అధికారులను నియమించటం జరిగిందన్నారు. శాసనమండలి ఎన్నికలు బ్యాలెట్ పేపరుతో మొదటి ప్రాధాన్యత ఓటు విధానంలో జరుగుతున్నందున చెల్లుబాటు అయ్యే విధంగా ఓటు వేసేలా ఓటర్లకు విస్తృత స్థాయిలో అవగాహన కోసం స్వీప్ కార్యక్రమాలను పట్టణాల్లో, గ్రామాల్లో నిర్వహించటం జరుగుతుందన్నారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్స్ లకు పూర్తి స్థాయిలో అన్ని భద్రత చర్యలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.







