బాపట్ల జిల్లాలో రూ.3,191 కోట్లతో జరుగుతున్న ప్రాజెక్టుల నిర్మాణం జిల్లాను వేగంగా అభివృద్ధిలోకి తీసుకువెళ్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్ న్యూ విసి హాల్లో హైబ్రిడ్ మోడ్ లో ఆయన సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిపై సుదీర్ఘంగా సమక్షించారు.
బాపట్ల జిల్లాలో చేపట్టిన పనులను అధికారులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బాపట్ల జిల్లా రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్నందున ఈ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా పర్యాటకంగానూ నూతన ఒరవడి సంతరించుకోనుందన్నారు. బాపట్లలో 9 ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్నట్లు వివరించారు. వీటిని త్వరగా పూర్తిచేస్తే అభివృద్ధితోపాటు పర్యాటక రంగంగా బాపట్ల జిల్లా విరాజిల్లుతుందన్నారు. వాటి పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులలో జాప్యం లేకుండా చూడాలని, సమస్యలు వస్తే తక్షణమే నా దృష్టికి తీసుకురావాలన్నారు. 167-ఎ వాడరేవు నుంచి పిడుగురాళ్ల వరకు రూ.796.93కోట్లతో నిర్మిస్తున్న జాతీయ రహదారి పనులు నాణ్యతతో చేపట్టాలన్నారు. వాగులుంటే వాటికి చప్టాలు నిర్మించాలని, రైల్వే ఓవర్ బ్రిడ్జి త్వరగా పూర్తి చేయాలన్నారు. బెంగళూరు-కడప-విజయవాడ జాతీయ రహదారి 544-జి నిర్మాణ పనులు రూ.458.65 కోట్లతో జరుగుతున్నాయన్నారు. బాపట్ల జిల్లాను తాకుతూ రహదారి వెళ్తుందన్నారు. నాణ్యతతో పనులు చేయాలని సూచించారు. రూ.1,700.2 కోట్లతో నిర్మిస్తున్న గుంటూరు- నిజాంపట్నం జాతీయ రహదారి పనులు వడివడిగా సాగాలన్నారు. రూ.9.75 కోట్లతో చేపట్టిన రేపల్లె-నిజాంపట్నం రాష్ట్రీయ రహదారి నిర్మాణంలో జాప్యం ఉండరాదన్నారు. అలాగే రూ.8.91 కోట్లతో 4.6 కిలోమీటర్ల మేర నిడుబ్రోలు-చందోలు రాష్ట్రీయ రహదారి విస్తరణ పనులు మార్చిలోగా పూర్తి చేయాలన్నారు.
నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ రూ.88.08 కోట్లతో చేపట్టిన పనులు గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జట్టి నిర్మాణం త్వరగా జరిగితే మత్స్యకారులకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కు 108.36 ఎకరాలు కేటాయించగా, ప్రస్తుతం 84.4 ఎకరాలలో నిర్మాణానికి భూమి చదునుతో సిద్ధం చేస్తున్నామన్నారు.
స్వదేశీ దర్శన్ పేరుతో రూ.97.52 కోట్లతో పర్యాటక రంగం అభివృద్ధికి పనులు మొదలయ్యాయని కలెక్టర్ చెప్పారు. ఇందులో భాగంగా ఆదర్శనగర్ కాల్వలో హౌస్ బోట్ ప్రాజెక్ట్ ను సూర్యలంక వద్ద ఏర్పాటు చేయాలన్నారు. మరో రెండు ఎకరాల భూమిని పరిశీలించాలని ఆర్డీవో ను ఆదేశించారు. హరిత రిసార్ట్స్ వద్ద రూ.7.50 కోట్ల నిధులతో అధునాతన హంగులతో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. స్విమ్మింగ్ పూల్, 10 కాటేజీల పనులు త్వర త్వరగా ముగించాలన్నారు. చీరాలలోని 50 పడకల ఆసుపత్రికి రూ.23.75 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలన్నారు. చీరాల ఏరియా ఆసుపత్రికి మంజూరైన రూ.4 లక్షల నిధులతో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇలా ప్రారంభమైన పలు ప్రాజెక్టులతో జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తుందని కలెక్టర్ వివరించారు. ఎంతో ప్రయోజనకరమైన ఈ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని, అభివృద్ధికి సహకరించాలని అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో మత్స్యశాఖ డిడి గాలి దేవుడు, వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయమ్మ, ఆర్ అండ్ బి డి అరుణ కుమారి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.