
గుంటూరు నగరంలో రోడ్లకు ప్యాచ్ వర్క్ లు ఎప్పటికప్పుడు చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ రాజాగారి తోట, పొన్నూరు రోడ్, బాలాజీ నగర్, కొరెటపాడు, నవభారత్ నగర్, వికాస్ నగర్ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి, పారిశుధ్య పనులను, తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రధాన, అంతర్గత రహదారులకు వార్డ్ సచివాలయాల వారీగా ప్యాచ్ వర్క్ లను ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చేపట్టాలని ఏఈలను ఆదేశించారు. బాలాజీ నగర్ రాజీవ్ గృహకల్ప ప్రాంతంలోని యానాది కాలనీలో నూతన డ్రైన్ నిర్మాణానికి అంచనాలు సిద్దం చేయాలన్నారు. అలాగే డ్రైన్లలో సిల్ట్ ని ఎప్పటికప్పుడు తొలగించాలని, చెత్త తరలింపుకు అవసరమైతే ప్రైవేట్ ట్రాక్టర్లు అద్దెకు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. గృహ కల్ప ప్రాంతంలో డ్రైన్ ఆక్రమణలను తక్షణం తొలగించాలని పట్టణ ప్రణాళిక కార్యదర్శులను ఆదేశించారు. కొరెటపాడు, వికాస్ నగర్ ప్రాంతాల్లో స్థానిక అవసరాల మేరకు డ్రైన్ల నిర్మాణంకు అంచనాలు సిద్దం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం బస్టాండ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, క్యాంటీన్ కి వచ్చే ప్రతి ఒక్కరికీ ఆహారం అందించేలా ఎప్పటికప్పుడు డిమాండ్ కి అనుగుణంగా ఇండెంట్ పెంచుకోవాలని సిబ్బందికి సూచించారు. పర్యటనలో డిఈఈ సతీష్ కుమార్, రమేష్ బాబు, ఏసిపి రెహ్మాన్, టిపిఎస్ లు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.







