
మచిలీపట్నం: డిసెంబర్ 16:-సర్వే నంబర్ ఆధారంగా ఆక్వా కల్చర్ రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామని, ఆక్వా రంగానికి రూ.1200 కోట్ల వరకు విద్యుత్ రాయితీ అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ–సహకార మార్కెటింగ్–పశుసంవర్ధక–పాడి పరిశ్రమ–మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
మంగళవారం ఉదయం పెనమలూరులోని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి అధికార సంస్థ (అప్సడా) పాలకవర్గ మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అప్సడా పాలకమండలి డైరెక్టర్లుగా దేశం శెట్టి వెంకట లక్ష్మీనారాయణ, లంకె నారాయణ ప్రసాద్, గుత్తికొండ శ్రీ రాజబాబు, మహమ్మద్ నూరుద్దీన్, విత్తనాల నాగ శ్రీనివాస్, రాచమల్ల మీరయ్య, వంకా కొండబాబు, వేగేశ్న సాయి మనోహర రాజు, వేగేశ్న సత్యనారాయణ రాజులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు.
మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా రంగం అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగమని, దేశవ్యాప్తంగా ఈ రంగంలో రాష్ట్ర వాటా 29 శాతం ఉందన్నారు. గతంలో ఆక్వా వ్యాపారానికి నిబంధనలు లేకపోయినప్పటికీ, ప్రస్తుతం నాణ్యతే ప్రధాన ప్రమాణంగా మారిందన్నారు. వ్యవసాయం గానీ, ఆక్వా రంగం గానీ నాణ్యత ఉంటేనే మంచి ధర లభిస్తుందని చెప్పారు.
ఆక్వా రంగంలో నాణ్యత, ట్రేసబులిటీ కీలకమని, అందుకు అనుగుణంగా రైతులు మారాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆక్వా రంగంలో ఆందోళన ఏర్పడినప్పటికీ, ఈ సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

ఆక్వా రంగానికి స్పష్టమైన విధానం, మార్కెటింగ్ వ్యవస్థ అవసరమని, ఈ దిశగా ఒక ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అనియంత్రితంగా చెరువులు త్రవ్వడం వల్ల కాలుష్య సమస్యలు తలెత్తుతున్నాయని, నిర్దిష్ట కాలపరిమితితో చేపలు, రొయ్యల చెరువులను రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం 49 శాతం ఆక్వా సాగు రిజిస్ట్రేషన్ పూర్తయిందన్నారు.
సర్వే నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, ఈ నెల 17 నుంచి అవి అమల్లోకి వస్తాయని తెలిపారు. జియో ట్యాగింగ్ ద్వారా ఏ సర్వే నంబర్లో ఎంత విస్తీర్ణంలో ఎవరు చేపలు, రొయ్యల సాగు చేస్తున్నారన్న పూర్తి వివరాలు నమోదు చేస్తున్నట్లు చెప్పారు.Machilipatnam Local News
ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే తేడా లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులందరికీ రూ.800 కోట్ల నుంచి రూ.1200 కోట్ల వరకు విద్యుత్ సబ్సిడీ పెంచినట్లు తెలిపారు. ఉభయ గోదావరి, ప్రకాశం, కృష్ణ జిల్లాల్లో నూరుశాతం రిజిస్ట్రేషన్ పూర్తి కావాలని అధికారులకు సూచించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని, కృత్రిమ మేధస్సు ద్వారా చెరువుల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించే అవకాశం ఉందన్నారు.
అప్సడా కో-చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ట్రేసబులిటీ సమస్య పరిష్కారానికి రెవెన్యూ క్లియరెన్స్ అవసరమని, దీనిపై సంబంధిత శాఖలతో సమన్వయం అవసరమన్నారు. విద్యుత్ రాయితీపై త్వరలో ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని తెలిపారు.
ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఆక్వా రంగం ద్వారా కోస్తా ప్రాంతాల్లో స్వయం ఉపాధి పెరుగుతోందన్నారు. ప్రభుత్వ హయాంలో ఆక్వా రైతులకు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందుతున్నాయని చెప్పారు.
ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు మాట్లాడుతూ అమెరికా టారిఫ్ల వల్ల ఆక్వా రంగం నష్టపోయిందని, ఎగుమతులు సజావుగా సాగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 6 లక్షల ఎకరాల్లో ఆక్వా కల్చర్ సాగు జరుగుతోందని, దానిని క్రమంగా 30 లక్షల ఎకరాలకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ నవీన్, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు, అదనపు డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణ–ఎన్టీఆర్ జిల్లాల మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది, పలువురు ఆక్వా రైతులు పాల్గొన్నారు.










