
అమరావతి: డిసెంబర్ 17:-ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక వృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అనంతపురం, విజయనగరాల్లో రెండు కొత్త ఎంఎస్ఎంఈ విస్తరణ కేంద్రాల ఏర్పాటుకు భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త” కార్యక్రమానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు సానుకూల స్పందన లభించడం, కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖతో నిర్వహించిన నిరంతర సంప్రదింపుల ఫలితంగానే ఈ కేంద్రాలకు ఆమోదం లభించిందన్నారు.
ఈ విస్తరణ కేంద్రాల ద్వారా ఎంఎస్ఎంఈలకు సాంకేతిక సహాయం, నైపుణ్యాభివృద్ధి, ఇంక్యుబేషన్, కన్సల్టెన్సీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కొత్త పరిశ్రమల స్థాపనకు దోహదపడటంతో పాటు స్థానిక ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు.Amaravathi Local News ఈ చొరవ స్వర్ణ ఆంధ్ర @2047 దార్శనికతకు అనుగుణంగా ఉందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆవిష్కరణ & రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లు, హైటెక్ సంస్థలకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు.
కొత్త విస్తరణ కేంద్రాలు విశాఖపట్నంలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ మార్గదర్శకత్వంలో పనిచేస్తాయని, CAD/CAM, సిమ్యులేటర్లు, వర్చువల్ క్లాస్రూమ్ల ద్వారా హైఎండ్ స్కిల్లింగ్ శిక్షణ అందిస్తామని తెలిపారు. స్థానిక పరిశ్రమలకు ఆధునిక యంత్రాల వినియోగానికి అవకాశాలు కలుగుతాయని అన్నారు.
ఈ నిర్ణయాన్ని ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్తమ్మిరెడ్డి శివ శంకర రావు స్వాగతించారు. రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాల్లోని సూక్ష్మ పరిశ్రమలకు ఇది కీలకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి డా. ఎన్. యువరాజ్ మాట్లాడుతూ, ఈ కేంద్రాలు రాష్ట్ర పారిశ్రామిక ప్రణాళికకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని, సంప్రదాయ పరిశ్రమలు, ఆధునిక సంస్థలకు సమగ్ర మద్దతు లభిస్తుందని తెలిపారు.
ఏపీఎంఎస్ఎంఈ అభివృద్ధి మండలి సీఈవో విశ్వ మనోహర్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టులను నోడల్ ఏజెన్సీ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్తో కలిసి అమలు చేస్తామని, త్వరలోనే విస్తరణ కేంద్రాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.







