
అమరావతి: డిసెంబర్ 17:-మహిళల వన్డే ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శనతో దేశానికే గర్వకారణమైన రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం భారీ ప్రోత్సాహం ప్రకటించింది. ఈ మేరకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో శ్రీచరణిని కలిసి రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహక చెక్ను స్వయంగా అందజేశారు.
కడప జిల్లాకు చెందిన శ్రీచరణి అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తూ ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో కీలక పాత్ర పోషించి జట్టు విజయంలో తన ప్రతిభను చాటారు. ఆమె అసాధారణ ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహంతో పాటు విశాఖపట్నంలో 500 గజాల విస్తీర్ణం గల ఇంటి స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించింది. అదేవిధంగా డిగ్రీ పూర్తైన అనంతరం రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 హోదా ఉద్యోగాన్ని కూడా కల్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కార్యక్రమంలో రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడుAmaravathi -visakha, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, శాప్ ఎండీ భరణి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ డి.శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ బి.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.







