
గుంటూరు:- వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ 5జీ, 6జీ సాంకేతిక పరిశోధనల రంగంలో మరో కీలక అడుగు వేసింది. నార్వేకు చెందిన ప్రముఖ టెలికాం సంస్థ నార్వేస్ నెట్వర్క్స్ ఏఎస్తో దీర్ఘకాలిక పరిశోధన, ఆవిష్కరణల భాగస్వామ్యానికి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరిందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు మంగళవారం వెల్లడించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నార్వేస్ నెట్వర్క్స్ ఏఎస్ సీఈఓ బహార్గుల్ ఎమిన్కు ఎంవోయూ పత్రాలను డాక్టర్ పీఎంవీ రావు అందజేశారు. ఈ ఒప్పందం ద్వారా విజ్ఞాన్స్ యూనివర్సిటీ క్యాంపస్లో అత్యాధునిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కేంద్రం ద్వారా 5జీ, 6జీ, నాన్–టెరెస్ట్రియల్ నెట్వర్క్స్, ప్రైవేట్ నెట్వర్క్స్, ఏఐ ఆధారిత కోర్ నెట్వర్క్స్, ఎడ్జ్ కంప్యూటింగ్, క్లౌడ్ టెక్నాలజీలపై పరిశోధనలు చేపట్టనున్నట్లు వివరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు, అధ్యాపకులు వినూత్న సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేసే అవకాశాలు లభిస్తాయని చెప్పారు. వడ్లమూడి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ‘వడ్లమూడి 5జీ విలేజ్’ వంటి ఫ్లాగ్షిప్ ప్రాజెక్టులు అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ సహకారంలో భాగంగా 5జీ స్టాండఅలోన్ సిస్టమ్స్, నెట్వర్క్ స్లైసింగ్, ఆటోమేషన్, ఏఐ–నేటివ్ 6జీ కోర్, స్మార్ట్ క్యాంపస్, ఆరోగ్యం, విద్య, తయారీ, రక్షణ, ఆక్వాకల్చర్ రంగాల్లో వినియోగించగల పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆధ్వర్యంలో రూపొందే ప్రాజెక్టులకు వాణిజ్య అవకాశాలు కల్పించడంతో పాటు సంయుక్త పేటెంట్లు, పరిశోధన పత్రాలు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు.
డీఎస్టీ, సేర్బ్, మైటీ, డీఓటీ, ఏఐసీటీఈ, ఇస్రోతో పాటు యూరోపియన్ యూనియన్ హారిజన్ యూరప్ వంటి జాతీయ, అంతర్జాతీయ నిధుల కోసం సంయుక్తంగా పరిశోధనా ప్రతిపాదనలు సమర్పించనున్నట్లు తెలిపారు.Guntur Local news
నార్వేస్ నెట్వర్క్స్ సంస్థ అత్యాధునిక ప్రైవేట్ 5జీ టెస్ట్బెడ్, 6జీ నెట్వర్క్ సాంకేతికతలను అందించడంతో పాటు యూరప్ పరిశ్రమల నుంచి వాస్తవ సమస్యలను విద్యార్థుల పరిశోధనలకు అందించనుందని పేర్కొన్నారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ తన ప్రయోగశాలలు, మౌలిక వసతులు, అధ్యాపక బృందం, పరిశోధనా వాతావరణంతో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను బలోపేతం చేయనుందని తెలిపారు.
మూడు సంవత్సరాల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉండగా, పరస్పర అంగీకారంతో పొడిగించే అవకాశం ఉందన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా విజ్ఞాన్స్ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమ–ఆధారిత పరిశోధనలకు కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.







