
బాపట్ల: డిసెంబర్ 30:-ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్రీ వీర పాండ్యన్ స్పష్టం చేశారు. బాపట్ల మండలం వెదుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దాదాపు రెండు గంటలకు పైగా పీహెచ్సీలోనే కొనసాగిన ఈ తనిఖీల్లో ఓపీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం, యాప్ల పనితీరు తదితర అంశాలను కమిషనర్ సవివరంగా పరిశీలించారు. రోగులు డాక్టర్ల వద్ద పొందుతున్న వైద్యం, ల్యాబ్లో రక్త నమూనాల సేకరణ, రక్త పరీక్షల నిర్వహణను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఏఎన్ఎంలు అందిస్తున్న సేవలు, ఔషధాల పంపిణీ, వైద్య పరీక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ‘డి.చంద్రమోహన్’ అనే రోగి వైద్య పరీక్షలకు వచ్చిన సమయంలో, రిజిస్ట్రేషన్ నుంచి వైద్యం పూర్తయ్యే వరకు ఆయన పక్కనే ఉండి వైద్య సేవల అమలు తీరును నిశితంగా గమనించారు. వైద్య ఆరోగ్యశాఖలో అమలవుతున్న వివిధ యాప్ల పనితీరుపై కూడా అధికారులను ప్రశ్నించారు.

రోగులకు అవసరమైన అన్ని ఔషధాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని కమిషనర్ వీర పాండ్యన్, కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యశాలల్లో 214 రకాల ఔషధాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ఔషధాల నిల్వలు, గడువు తేదీలు, పంపిణీ విధానాన్ని పరిశీలించారు. కుష్టి రోగులకు అందిస్తున్న ఔషధాల రికార్డులను కూడా తనిఖీ చేశారు.Bapatla Local News
పీహెచ్సీ సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేస్తున్న ఎఫ్ఆర్ఎస్ హాజరును పరిశీలించిన కమిషనర్, ఒక్కొక్క సిబ్బందిని పిలిచి వారి పనితీరుపై ప్రశ్నలు వేశారు. పీహెచ్సీలోని అన్ని విభాగాలకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించిన అనంతరం రోగులతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు. వైద్యులు సక్రమంగా చూస్తున్నారా, సమాధానాలు ఇస్తున్నారా, మందులు సరిగా అందుతున్నాయా, ఎవరైనా లంచాలు అడుగుతున్నారా అంటూ ప్రశ్నించారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చేలా వైద్య అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
ఈ తనిఖీలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయమ్మ, బాపట్ల ఆర్డీఓ పి. గ్లోరియా, ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్, వైద్య అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.







