
బాపట్ల: డిసెంబర్ 30 :-రైతుల వ్యవసాయ భూములు ఏ మండలంలో ఉంటాయో, అదే మండలంలో రైతులకు అవసరమైన ఎరువులు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐఏఎస్ స్పష్టం చేశారు.
మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మండల వ్యవసాయ అధికారులు, ఏడీలు, గృహ నిర్మాణ సంస్థ ఏఈలు, డీఈలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎరువుల పంపిణీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణాలు, మున్సిపల్ సేవలు, ఇంటింటి చెత్త సేకరణ అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువుల పంపిణీ జరగాల్సిన పూర్తి బాధ్యత మండల వ్యవసాయ అధికారులదేనని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ఎరువుల కొరత లేదా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎరువుల పంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు.
ఐఎఫ్ఎంఎస్ను ప్రతిరోజూ అప్డేట్ చేయాల్సిన బాధ్యత కూడా మండల వ్యవసాయ అధికారులదేనని పేర్కొన్నారు. ఎరువుల పంపిణీలో మెరుగైన పనితీరు కనబర్చిన మండల వ్యవసాయ అధికారులకు జనవరి 26న అవార్డులు ప్రదానం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మండలాల వారీగా ఎరువుల నిల్వల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద చేపడుతున్న పేదల గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణంలో రాష్ట్రస్థాయిలో బాపట్ల జిల్లా టాప్–3లో నిలిచేలా అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలను అప్డేట్ చేసి, గృహ నిర్మాణాలు పూర్తిచేసుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు.

గృహ నిర్మాణానికి నిధులు సమృద్ధిగా ఉన్నాయని, పనుల పురోగతి మందగించిన మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి కారణాలు వివరించాలని కలెక్టర్ ఆదేశించారు.Bapatla Local News
అలాగే మున్సిపాలిటీల పరిధిలో ప్రతిరోజూ ఇంటింటి నుండి వందశాతం చెత్త సేకరించి వెంటనే డంపింగ్ యార్డులకు తరలించాలని సూచించారు. మున్సిపల్ సేవలపై ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ సమావేశంలో ఇంచార్జి జిల్లా వ్యవసాయ అధికారి అన్నపూర్ణ, గృహ నిర్మాణ సంస్థ పీడీ వెంకటేశ్వరరావు, బాపట్ల, చీరాల, రేపల్లె, అద్దంకి మున్సిపల్ కమిషనర్లు రఘునాథ్ రెడ్డి, రవీంద్రబాబు, జోసఫ్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.







