
చీరాల: డిసెంబరు 31:-రాష్ట్రంలో ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులకు ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయని చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు అన్నారు. చీరాల పట్టణం 22వ, 15వ వార్డులు, చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో కూటమి నాయకులతో కలిసి ఆయన అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్ల పంపిణీ జరుగుతుందని తెలిపారు. అయితే జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం సెలవు కావడంతో ఈ నెలలో ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే కొత్తగా మంజూరైన పెన్షన్లను కూడా నేటి నుంచే అర్హులకు అందజేస్తున్నామని పేర్కొన్నారు.
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, ప్రతి నెలా ఖచ్చితంగా పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందించడం కూటమి ప్రభుత్వ ప్రత్యేకత అని ఎమ్మెల్యే అన్నారు. గత 18 నెలల కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద చీరాల నియోజకవర్గంలో 677 మందికి రూ.6.58 కోట్ల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. ఇది చీరాల చరిత్రలోనే ఒక రికార్డు అని ఆయన పేర్కొన్నారు.

ఈ విజయాలన్నీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పారదర్శక పాలనకు నిదర్శనమని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గారు అన్నారు. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం ప్రజలు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో ఒక్క చెక్కు కూడా ఇవ్వని పరిస్థితి ఉందని ఆయన విమర్శించారు.Chirala Local News
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.







