
మచిలీపట్నం: జనవరి 3 :సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం యోగా సాధన అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు నగరంలోని చింతగుంటపాలెంలో నిర్వహించనున్న ఉచిత యోగా శిక్షణ తరగతులను ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ యోగాసభ మచిలీపట్నం శాఖ, చింతగుంటపాలెం దివ్య యోగ మందిర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత యోగా శిక్షణ, చికిత్స శిబిరానికి సంబంధించిన కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందన్నారు. అవయవాలు ఉన్నంత వరకు యోగాసనాలు, ప్రాణాలు ఉన్నంత వరకు ప్రాణాయామం చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించుకోవడంలో యోగా మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో దోహదపడుతుందన్నారు. యోగ సాధనతో శారీరక, మానసిక ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు.Krishna Local News
ఈ ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రతిరోజూ ఉదయం 5.30 గంటల నుంచి 8 గంటల వరకు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన యోగా నిపుణులచే నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వినియోగించుకోవాలని కోరారు.
అనంతరం ఏపీ యోగాసభ మచిలీపట్నం శాఖ ప్రధాన కార్యదర్శి, యోగా గురువులు మాట్లాడుతూ యోగా గురువు శ్రీ ములకరాజ్ జి మహారాజ్ వారి 127వ జయంతి మహోత్సవాల సందర్భంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాది నుంచి విచ్చేస్తున్న కార్యనిర్వాహక యోగాచారిణి దమయంతి జీ సమక్షంలో ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు ఉచిత యోగా శిక్షణ, చికిత్స శిబిరం జరుగుతుందన్నారు.
మందులు లేకుండా యోగ చికిత్స ద్వారా రక్తపోటు, మధుమేహం, సయాటికా, కీళ్ల నొప్పులు, ఆస్తమా, నరాల బలహీనత, అధిక బరువు వంటి అనేక వ్యాధుల నివారణకు ప్రాణాయామాలు, యోగాసనాలపై శిక్షణ ఇస్తామన్నారు. మహిళలకు ప్రత్యేకంగా యోగ శిక్షణ, చికిత్స అందిస్తామని తెలిపారు.
ఈ నెల 11వ తేదీన ఆదివారం ఉదయం 9 గంటలకు తిలక ధారణ, 10 గంటలకు పురవీధులలో శోభాయాత్ర, అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు భోజన ప్రసాద వినియోగం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యోగా గురువులు జి. గురునాథ్ బాబు, మద్దాల చింతయ్య, సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ ఎం. వెంకటేశ్వర ప్రసాద్, యోగా సభ్యులు ఆర్. దుర్గాప్రసాద్, జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.
— జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణా జిల్లా, మచిలీపట్నం










