
ఫిబ్రవరిలో 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఫిబ్రవరిలో గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరగనున్న ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులకు నిర్దేశించిన ర్యాలీ అన్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్మీ రిక్రూటింగ్ డైరెక్టర్ కోల్నెల్ ..మాట్లాడుతూ ఫిబ్రవరిలో 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. అభ్యర్థులుఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లరికల్ , స్టోర్ కీపర్, ట్రేడ్స్ మెన్ తదితర విభాగాలలో 10వ తరగతి, 8వ తరగతి విభాగాలలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ జరుగుతుందన్నారు. మహిళలకు తమిళనాడు రాష్ట్రం వేలూరులో ఫిబ్రవరి 5వ తేదీ నుండి ప్రత్యేకంగా జరుగుతుందని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వివిధ దశలలో జరుగుతుందని చెప్పారు. మొదటగా 1.60 కిలో మీటర్ల పరుగు తరువాత శారీరక పరీక్షలలో భాగంగా పుల్ అప్స్, జిగ్ జాగ్, 9 అడుగుల గుంతను దాటడం తదితర అంశాలలో పరీక్షించి అందులో ఎంపికైన వారికి ఎత్తు, బరువు తదితర శారీరక కొలతల పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. మరుచటి రోజున డ్రగ్ పరీక్షలు, మెడికల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. అభ్యర్థుల శరీరంపై ఎక్కడా ఐదు సెంటిమీటర్లు మించి టాటూలు ఉండరాదని, అయితే గిరిజన తెగలకు మాత్రం వారి ఆచారాల మేరకు వెసులుబాటు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులకు రెండు, మూడు నెలల తర్వాత సులభ మెడికల్ పరీక్షలు నిర్వహించి, నియామకం చేయడం జరుగుతుందని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు వారు రిజిస్టర్ చేసుకున్న ఇ – మెయిల్ కు నియామక ఉత్తర్వులు పంపించడం జరుగుతుందన్నారు. జిల్లా యంత్రాంగం మౌలిక సదుపాయాలు కల్పనలో సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, అదనపు పోలీసు సూపరింటెండెంట్ హనుమంతు, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీహరి, జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా, జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్. గుణశీల, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం. శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







