AP LATEST NEWS: డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా మారాలి – ప్రజల్లో డిజిటల్ అక్షరాతస్య పెంపొందించాలి
AP CM CHANDRA BABU MEETING ON DIGITAL SERVICES
రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ డిజిటల్ అక్షరాస్యుడిగా మారాలి, తద్వారా రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చి దిద్దాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. పీపుల్స్ పర్సెప్షన్, ఆర్టీజీఎస్ పైన సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ప్రగతి గురించి సమీక్షించారు. రాష్ట్రంలో ప్రజలందరూ వాట్సాప్ గవర్నెన్స్ సులభంగా ఉపయోగించుకునేలా, ప్రభుత్వం నుంచి ఏ సేవ కావాలన్నా అధికారులు, కార్యలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కేవలం తమ ఫోనులో వాట్సాప్ ద్వారా తమకు కావాల్సిన సేవలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కల్పిస్తోందన్నారు. దీనిపై ప్రజల్లో ఇంకా కొంత అవగాహన తక్కువగా ఉందని, ప్రజలందరూ సమర్థవంతంగా వాట్సాప్ గవర్నెన్స్ను విరివిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లందరూ ఈ బాధ్యత తీసుకుని తమ జిల్లాలో ప్రజల్లో వాట్సాప్ గవర్నెన్స్ను పెద్ద ఎత్తున ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయాలు, సచివాలయ సిబ్బంది ద్వారా ఆయా ప్రాంతాల్లో దీని గురించి ప్రజల్లో అవగాహన పెంచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. వాట్సాప్ అర్జీలు ఇవ్వొచ్చు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు కేవలం ప్రభుత్వం నుంచి సేవలు పొందడమే కాదని, ఫిర్యాదులు, అర్జీలు కూడా పెట్టుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సదుపాయం గురించి ప్రజలకు వివరించాలన్నారు. నిరక్షరాస్యులు కేవలం తమ ఫిర్యాదును వాయిస్ ద్వారా కూడా వాట్సాప్ గవర్నెన్స్ వాట్సాప్ తెలిపే సదుపాయాన్ని త్వరలో కల్పించబోతున్నామని తెలిపారు. పౌరుల్లో డిజిటల్ అక్షరాస్యత పెరిగితే వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగిత కూడా పెరుగుతుందన్నారు. వాట్సాప్లో క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ప్రజలు వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగించుకునే సదుపాయం కల్పించే చర్యలు కూడా వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. డేటా లేక్ ఏర్పాటు డేటా అనుసంధాన ప్రక్రియ కూడా వేగవంతంగా జరగాలన్నారు. డేటా లేక్ ఏర్పాటు చేయడంలో ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న అత్యుత్తమ ప్రమాణాలను పాటించాలన్నారు.