
గుంటూరు, జనవరి 25:- గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదని, నిర్ణీత గడువుల్లో అన్ని పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అధికారులను ఆదేశించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రజా గ్రీవెన్స్లో వస్తున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే, వాటిని ఆలస్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న, ప్రతిపాదిత అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.
25వ వార్డులో గెలాక్సీ బార్ పక్కన ఉన్న రోడ్డును వెడల్పు చేయడంలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి, జనవరి 30లోపు పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. అలాగే 25వ డివిజన్లోని జమీందార్ చెరువుకు కాంపౌండ్ వాల్ నిర్మించి, ప్రజలకు ఉపయోగపడేలా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
43వ డివిజన్ విద్యానగర్ రెండో లైన్లో పునర్నిర్మాణ ప్రక్రియను పూర్తిచేసి వెంటనే బాండ్లు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సుగాలి కాలనీ కాలువ నిర్మాణానికి శాంక్షన్ మంజూరైన నేపథ్యంలో, 20 మీటర్ల పొడవున కాలువ పనులకు అడ్డుగా ఉన్న సమస్యలను తొలగించి వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు.
ముత్యాల రెడ్డి నగర్ మెయిన్ రోడ్డుకు సంబంధించి సీసీ రోడ్డు, కాలువల పనులు మంజూరైనందున, మాస్టర్ ప్లాన్ ప్రకారం 40 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేయాలని, పనులు వేగవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యానగర్ మొదటి లైన్ విస్తరణ పనులు సీతయ్య డొంక వరకు పూర్తి చేయాలని తెలిపారు.
నీలంపాటి అమ్మవారి గుడి నుంచి ఆంజనేయ స్వామి గుడి వరకు కాలువల నిర్మాణానికి మంజూరు ఉన్నందున, రోడ్డు విస్తరణ కూడా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ముత్యాల రెడ్డి నగర్ వాగు నుంచి అమరావతి రోడ్డు వరకు కాలువ నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ ద్వారా మార్కింగ్ చేసి, అవరోధాలను తొలగించి సర్వే పూర్తిచేయాలని ఆదేశించారు.
49వ డివిజన్ కొండయ్య కాలనిలో రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని స్పష్టం చేశారు. 36వ డివిజన్లోని రజక చెరువు సర్వే పూర్తైన నేపథ్యంలో అక్కడ కాంపౌండ్ వాల్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.

20వ డివిజన్ నంబూరు సుభాని కాలనీ, పీకల వాగు కట్ట వద్ద 20 మీటర్ల రోడ్డు పనులు నిలిచిపోయాయని పేర్కొంటూ, సర్వే నిర్వహించి రోడ్డు ఏర్పాటు చేస్తే ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తీరుతాయని అన్నారు. వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.Guntur Local News
అలాగే అనంతవరపాడు లేఔట్ పరిధిలో సుమారు 6 వేల మంది లబ్ధిదారులకు గత వైసీపీ ప్రభుత్వంలో స్థలాలు చూపించకుండా రిజిస్ట్రేషన్లు చేసిన కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే లబ్ధిదారులకు కేటాయించిన స్థలాలు చూపించి, ఇళ్ల నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని అధికారులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.










