
సికింద్రాబాద్:-విధి నిర్వహణలో భాగంగా గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం అత్యంత బాధాకరమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

సోమవారం గాంధీ ఆసుపత్రిలో సౌమ్య భౌతికకాయానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించి, మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సౌమ్య కుటుంబానికి ప్రభుత్వ పరంగా కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించడంతో పాటు, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా ఎక్సైజ్ పోలీసుల తరఫున 50 లక్షల రూపాయల సహాయం అందజేయడం కుటుంబానికి పెద్ద చేయూతగా నిలుస్తుందని తెలిపారు.

విధి నిర్వహణలో గంజాయి ముఠా దుర్మార్గానికి బలైన కానిస్టేబుల్ సౌమ్య ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబం ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎక్సైజ్ విధుల్లో ఉన్న పోలీసులకు అవసరమైన ఆయుధాలు, భద్రతా ఏర్పాట్లు కల్పించి వారి మనోధైర్యాన్ని పెంపొందిస్తామని మంత్రి తెలిపారుHyderabad local news.
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పాటు, ఈ విషయంలో ఎక్సైజ్ పోలీసులు చేస్తున్న కృషిని మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు.










