
మచిలీపట్నం, ఫిబ్రవరి 2:– జిల్లాలో అనుమతులు పొందిన పరిశ్రమలు త్వరితగతిన స్థాపించుకునేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు.

సోమవారం ఉదయం నగరంలోని తన చాంబర్లో పరిశ్రమల స్థాపనపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్, ప్రత్యేక అధికారుల వారీగా పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 237 పరిశ్రమల యూనిట్ల స్థాపనకు అనుమతులు మంజూరైనప్పటికీ, సంస్థాగత సమస్యలు మరియు ఇతర అడ్డంకుల కారణంగా పురోగతి ఆశించిన స్థాయిలో లేదన్నారు. ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు.
మూడు పర్యాయాలు సమావేశాలు నిర్వహించినప్పటికీ పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ అధికారులు సరైన శ్రద్ధ చూపకపోవడంపై జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సరైన పురోగతి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. బిల్డింగ్ ప్రణాళికల ఆమోదం, సరిహద్దుల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాల్లో సంబంధిత శాఖలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.
సమస్యలు పూర్తిగా పరిష్కరించినప్పటికీ యూనిట్లు ప్రారంభించని సంస్థలకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. యూనిట్ల స్థాపనకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను అవసరమైతే వేరే ప్రాంతాలకు మార్చాలని సూచించారు.
మల్లవల్లి పారిశ్రామికవాడలో పునాదిరాళ్ల ఏర్పాటు జరిగిందన్న సమాచారాన్ని ప్రతి పారిశ్రామికవేత్తకు వెంటనే తెలియజేయాలని ఆదేశించారు. మరో 15 రోజుల్లో మళ్లీ సమీక్ష సమావేశం నిర్వహిస్తానని, ఆలోగా గణనీయమైన పురోగతి సాధించాలని అధికారులకు సూచించారు.Krishna Local News : మండవల్లి మండలంలో ఎన్టీఆర్కు ఘన నివాళులు
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం వెంకట్రావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ బాబ్జి, ప్రత్యేక అధికారులు షాహిద్ బాబు, డీఎఫ్ఓ సునీత, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం, డీటిడబ్ల్యూ ఫణి ధూర్జటి, మార్క్ఫెడ్ డీఎం మురళీకిషోర్, డీసీఓ చంద్రశేఖర్, హౌసింగ్ ఈఈ వెంకటరావు, చేనేత జౌళి శాఖ ఏడీ సాయిప్రసాద్, నైపుణ్యాభివృద్ధి అధికారి నరేష్, డీఎల్పీఓ సుజాత శర్మ తదితర అధికారులు పాల్గొన్నారు.










