
గుంటూరు : చేబ్రోలు:- వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో “కాన్క్లేవ్ ఆన్ రెస్పాన్సిబుల్ అండ్ సస్టేనబుల్ ఏఐ” సదస్సు ఘనంగా నిర్వహించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ మరియు కోర్ ఏఐ కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో “బిల్డింగ్ బెటర్ విత్ ఏఐ: సస్టేనబిలిటీ యాస్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ ఇండియా” అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన స్విస్నెక్స్ ఇన్ ఇండియా అకడెమిక్ ఎంగేజ్మెంట్ హెడ్ లీనా మారైకే జోసెఫిన్ రోబ్రా మాట్లాడుతూ, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ఖర్చుతో, స్వదేశీ అవసరాలకు అనుగుణంగా రూపొందించే ఓపెన్ సోర్స్, లో రిసోర్స్ ఏఐ మోడళ్లు సుస్థిర అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు. తక్కువ వనరులతో రూపొందించే ఏఐ ద్వారా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలకు కూడా ఆధునిక సాంకేతిక సేవలు అందించవచ్చని తెలిపారు.

వ్యవసాయ రంగంలో పంటల దిగుబడి అంచనాలు, తెగుళ్ల గుర్తింపు, వాతావరణ సూచనల ద్వారా రైతులకు నిర్ణయాలు తీసుకునేలా ఏఐ సహకరిస్తుందని చెప్పారు. విద్యారంగంలో స్థానిక భాషల డిజిటల్ కంటెంట్, ఆటోమేటెడ్ ట్యూటరింగ్, ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించవచ్చన్నారు. అలాగే ఆరోగ్య రంగంలో తక్కువ ఖర్చుతో రోగ నిర్ధారణ, టెలీమెడిసిన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డేటా ఆధారిత సేవలు అందించడంలో ఏఐ కీలకమని వివరించారు.
ఇంకొక ముఖ్య అతిథి టెడ్ఎక్స్ స్పీకర్, ఎమినెంట్ ఇంజినీర్, ఫోర్బ్స్ 200 డీజీఈఎంఎస్, మాజీ ఏసీఎం ఇండియా అధ్యక్షుడు డా. శ్రీనివాస్ పద్మనాభుని మాట్లాడుతూ, వ్యవసాయంలో నేల ఆరోగ్య విశ్లేషణ, పంటల ఎంపిక, తెగుళ్ల ముందస్తు గుర్తింపులో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందన్నారు. బయోటెక్నాలజీ రంగంలో ఔషధాల అభివృద్ధి, జీనోమ్ విశ్లేషణ, వ్యక్తిగత వైద్య సేవల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పునరుత్పాదక శక్తి, వ్యర్థాల నిర్వహణ, నీటి వనరుల సంరక్షణ, కాలుష్య నియంత్రణలో కూడా ఏఐ ఆధారిత పరిష్కారాలు సుస్థిరతకు దోహదపడతాయని చెప్పారు.Guntur Local News
ఈ కార్యక్రమంలో సీఐఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తన్వీర్ హసన్, అమృత విశ్వ విద్యాపీఠం ప్రొఫెసర్ శ్రీరామ్ దేవనాథన్, ఐఐటీ మద్రాస్ సీఈఆర్ఏఐ ఏఐ పాలసీ హెడ్ డా. గీతా రాజు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. వర్చువల్గా విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, యూనివర్సిటీ ఇంచార్జి వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కేవీ కృష్ణకిశోర్, డీన్లు, విభాగాధిపతులు, విద్యార్థులు హాజరయ్యారు.










