
బాపట్ల, ఫిబ్రవరి 02, 2026:-గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటి నుంచి తప్పనిసరిగా చెత్త సేకరణ జరగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పరిశుభ్రత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పంచాయతీ, మున్సిపల్ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంచాయతీ సెక్రటరీలు సెలవుల్లో ఉన్నప్పటికీ పనులు నిలిచిపోకుండా ప్రత్యామ్నాయ అధికారులను వెంటనే నియమించాలని సూచించారు.
మండలాల వారీగా కనీసం 75 శాతం చెత్త సేకరణ జరగాలని, త్వరలోనే వంద శాతం లక్ష్యాన్ని సాధించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వేమూరు మండలం పెనుమర్రు పంచాయతీలో చెత్త సేకరణ సరిగా జరగకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం సహించేది లేదని స్పష్టం చేశారు.

జిల్లాలో జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి ప్రతి గ్రామంలో వంద శాతం తాగునీటి సరఫరా అమలు చేయాలని ఆదేశించారు. నీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచాలని, ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం తగదన్నారు.
అలాగే స్వామిత్వ సర్వే, ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్సుల వసూళ్లను పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని సూచించారు. రేపల్లె పట్టణంలో ట్రేడ్ లైసెన్సుల వసూళ్లు సరిగా జరగకపోవడంపై ఎంపిడివోపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్లపాలెం మండలంలో షాపింగ్ ట్యాక్సీల వసూళ్లు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.Bapatla Local News
జిల్లాలో పెండింగ్లో ఉన్న పీఎంజేవీవై పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో డీపీఓ ప్రభాకర్ రావు, డీఆర్డిఏ పీడీ సింగయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ అనంతరాజు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడివోలు, డిప్యూటీ ఎంపిడివోలు హైబ్రిడ్ విధానంలో పాల్గొన్నారు.










