
బాపట్ల, ఫిబ్రవరి 2:– ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి. అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో ఉపాధి హామీ పథకం అమలు తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా అభివృద్ధి పనులను ప్రామాణికంగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని “జి–రామ్–జి” పథకంగా మారుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మంజూరైన పనులన్నింటినీ శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పేరు మార్పు కారణంగా వచ్చే రెండు నెలలపాటు కొత్త పనులకు మంజూరు ఉండదని, అందువల్ల పెండింగ్ పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే ఆన్లైన్లో సమర్పించి, కూలీలకు చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలని ఆదేశించారు. 233 గ్రామపంచాయతీల్లో ఉపాధి పనులు ప్రారంభం కాకపోవడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరుపేదలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కూలి పనులను తక్షణమే ప్రారంభించాలని సూచించారు.
జలశక్తి అభియాన్ పనుల్లో నిజాంపట్నం ప్రాంతంలో జరుగుతున్న జాప్యంపై అధికారుల నుంచి వివరణ కోరారు. రేపల్లెలో మురికినీటి ఇంకుడు గుంతల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, వర్మీ కంపోస్ట్ యూనిట్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణ పనులకు సంబంధించి ప్రతి లబ్ధిదారునికి 90 రోజుల పని దినాలు కల్పించాలని సూచించారు.

పల్లె పండుగ కార్యక్రమంలో 350 పనులు మంజూరుకాగా, కేవలం 136 పనులే పురోగతిలో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, మిగిలిన పనులన్నింటినీ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి మంజూరైన 10 పనుల్లో కేవలం రెండు మాత్రమే ప్రారంభం కావడంపై ప్రశ్నిస్తూ, మిగిలిన భవనాల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
ఉద్యాన పంటలు, కొబ్బరి మొక్కలను లక్ష్యానికి అనుగుణంగా నాటాలని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఉగాది నాటికి 6,441 గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని, మార్చి 18 నాటికి అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి వారం లక్ష్యాలు నిర్ధేశించుకుని ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని స్పష్టం చేశారు.Bapatla local news
ఈ సమావేశంలో డ్వామా పీడీ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటేశ్వరరావు, ఎంపీడీవోలు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.










