
అమరావతి:-విశాఖ స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్) పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సీఎండీ మనీష్ రాజ్ గుప్తా, చీఫ్ సెక్రటరీ విజయానంద్తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గత ఏడాదిన్నర కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అనూహ్యమైన పురోగతి సాధించిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గతంలో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న ఆర్ఐఎన్ఎల్ ప్రస్తుతం లాభాల బాట పట్టిందని తెలిపారు.
హాట్ మెటల్ ఉత్పత్తిలో రోజుకు 19,401 టన్నుల ఉక్కు ఉత్పత్తికి విశాఖ స్టీల్ చేరుకుందని వెల్లడించారు. 2024-25 రెండో త్రైమాసికంలో రోజుకు కేవలం 9,215 టన్నుల ఉత్పత్తి మాత్రమే జరిగిన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. ప్రస్తుతం మూడు బ్లాస్ట్ ఫర్నేస్లు పనిచేయడంతో ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు.
స్టీల్ ప్లాంట్ సామర్థ్య వినియోగం రికార్డు స్థాయిలో 94 శాతానికి చేరుకుందని తెలిపారు. గతంలో 2024-25 రెండో త్రైమాసికంలో ఇది కేవలం 45 శాతమేనని వివరించారు. ఆర్థికంగా కూడా విశాఖ స్టీల్ గణనీయంగా కోలుకుందని అధికారులు తెలిపారు.
2024 సెప్టెంబర్లో రూ.486 కోట్ల నష్టాలు ఎదుర్కొన్న విశాఖ స్టీల్, 2026 జనవరిలో రూ.54 కోట్ల లాభాన్ని నమోదు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన రూ.11 వేల కోట్ల సహాయంతో సంస్థ నిలదొక్కుకుందని, ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్కు క్రెడిట్ రేటింగ్ కూడా పెరిగిందని అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అన్ని విభాగాల్లో కొత్త విధానాలను అమలు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. కార్మికులు, ఉద్యోగులను సమర్థంగా వినియోగిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని అభిప్రాయపడ్డారు.
యాజమాన్యం, కార్మికులు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే విశాఖ ఉక్కును విజయపథంలో నడిపించవచ్చని సీఎం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి సంస్థలో అమలుచేసిన సంస్కరణలు, కార్మికుల సహకారంతో సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.visakha Local News :కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) – కలెక్టర్ కీలక ఆదేశాలు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశాఖ స్టీల్కు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.










