
Guntur Local News :చేబ్రోలు మండలంలోని పాఠశాలల తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష

ఈ సందర్భంగా నారాకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు ఒక పాఠ్యాంశాన్ని స్వయంగా బోధించి, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులు రోజువారీగా అనుసరిస్తున్న విద్యా కార్యక్రమాలు, ఈ విద్యా సంవత్సరంలో రాసిన పరీక్షలు, సాధించిన మార్కుల వివరాలను తెలుసుకున్నారు. పలు ప్రశ్నలు అడిగి విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టారు.

విద్యార్థులందరూ నోటు పుస్తకాలను చక్కగా నిర్వహించడం, ఏకరూప దుస్తుల్లో క్రమశిక్షణతో ఉండటం పట్ల వారిని అభినందించారు. 10వ తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళిక, సాయంత్రం అందిస్తున్న అల్పాహారం గురించి వివరాలు తెలుసుకుని, పాఠశాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీ ఏడుకొండలను అభినందించారు.
అనంతరం చేబ్రోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి, 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థుల ప్రశ్నాపత్రాలను తనిఖీ చేశారు. పాఠశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, సంబంధిత రికార్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన నాణ్యత విషయంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎలాంటి రాజీ పడకూడదని సూచించారు. భోజనం వడ్డించే ప్రాంతం పూర్తిగా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.GUNTUR NEWS
తదుపరి ప్రాథమిక పాఠశాలలో అమలవుతున్న 75 రోజుల జీఎఫ్ఎల్ఎన్ (GFLN) కార్యక్రమాన్ని పరిశీలించి, ప్రతి విద్యార్థి 100 శాతం జీఎఫ్ఎల్ఎన్ సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు.










