
గుంటూరు, ఫిబ్రవరి 6:-ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రత్తిపాడు శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గ స్థాయి బ్యాంకర్ల సమావేశం శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగవచ్చని పేర్కొన్నారు. ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, బ్యాంకర్ల మధ్య సమన్వయం అత్యంత అవసరమని తెలిపారు.

వట్టిచెరుకూరు, పెదనందిపాడు, ప్రత్తిపాడు, కాకుమాను మండలాల్లో బల్క్ కూలింగ్ సెంటర్ల ఏర్పాటు ద్వారా పాల సేకరణకు విస్తృత అవకాశాలున్నాయని తెలిపారు. ప్రతిరోజూ కనీసం 5 వేల లీటర్ల పాల సేకరణ లక్ష్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. అలాగే గ్రూపులుగా ఏర్పడి డ్రోన్ల కొనుగోలు–అమ్మకాలు, రైస్ మిల్లులు వంటి యూనిట్ల స్థాపనకు అవకాశాలున్నాయని చెప్పారు.

నియోజకవర్గంలో వరి, మిరప, పత్తి పంటలకు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది బ్యాంకర్లు రూ. 2,200 కోట్ల రుణాలు మంజూరు చేశారని, సరైన కార్యాచరణ ప్రణాళికతో ఈ రుణాలను వినియోగిస్తే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు.Guntur Local News
ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా లేదా రెండు, మూడు గ్రామాలు కలిసి ఒక యూనిట్గా అభివృద్ధి చేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని, సబ్సిడీతో పాటు మిగిలిన విద్యుత్తును విక్రయించే అవకాశం ఉంటుందని వివరించారు. ముద్ర రుణాల ద్వారా చిన్న యూనిట్ల నుంచి పెద్ద పరిశ్రమల వరకు స్థాపించవచ్చని సూచించారు.
సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ సందీప్ బాబు వారు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి. జ్యోతి బసు, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి. విజయలక్ష్మి, సహాయ ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.










