
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 7:– ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం 2024–26 మధ్య కాలంలో అపూర్వమైన స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో పర్యాటక రంగంలో రూ.30,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని, దీని ద్వారా 1.22 లక్షల ఉద్యోగాలు సృష్టించామని మంత్రి వెల్లడించారు. “ప్రతి కుటుంబానికి ఒక పర్యాటక ఉద్యోగం” అన్నది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచనలతో “హెల్తీ, వెల్తీ, హ్యాపీ” నినాదంతో ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దాలన్న ప్రధాని మోదీ సంకల్పానికి అనుగుణంగా, ఏపీని స్వర్ణాంధ్రగా మార్చడమే సీఎం చంద్రబాబు దృష్టి అన్నారు.
పర్యాటక రంగమే ఆర్థిక వృద్ధికి ఇంజిన్
గత ప్రభుత్వ హయాంలో కుదేలైన పర్యాటక రంగాన్ని తిరిగి పట్టాలెక్కించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. నూతన పర్యాటక పాలసీ (2024–29) ద్వారా ఈ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించామని చెప్పారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఇన్వెస్టర్ మీట్ల ద్వారా 117 ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. హయత్, తాజ్, మారియట్, మేఫేర్ వంటి స్టార్ హోటళ్లు రాష్ట్రంలో నిర్మాణాలకు ముందుకు రావడం ప్రభుత్వంపై నమ్మకానికి నిదర్శనమన్నారు.
కేంద్రం నుంచి భారీ నిధులు
కేంద్ర ప్రభుత్వం నుంచి 8 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.428 కోట్ల గ్రాంట్ సాధించామని మంత్రి తెలిపారు. అఖండ గోదావరి, గండికోట, సూర్యలంక బీచ్, బొర్రా గుహలు, అహోబిలం, నాగార్జునసాగర్ బౌద్ధ కేంద్రాలు, అన్నవరం దేవస్థానం తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని వివరించారు.
థీమాటిక్ సర్క్యూట్లు – కొత్త ఆకర్షణలు
రాష్ట్రంలో 7 యాంకర్ హబ్లు, 25కి పైగా థీమాటిక్ సర్క్యూట్లు, 90కి పైగా అడ్వెంచర్ టూరిజం ప్రాంతాలకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. విశాఖ–చెన్నై–పుదుచ్చేరి క్రూయిజ్ సేవలు, హౌస్బోట్లు, సీప్లేన్, హెలీ టూరిజం, కారవాన్ టూరిజం సేవలు విస్తరిస్తున్నామని చెప్పారు. 1,855 హోమ్స్టేలను అగ్రిగేటర్ ప్లాట్ఫారమ్లతో అనుసంధానించామని పేర్కొన్నారు.
పర్యాటక ఉత్సవాలు – సంస్కృతికి ఊపిరి
విజయవాడ, విశాఖ, అరకు చలి ఉత్సవం, గండికోట ఉత్సవం, అమరావతి ఆవకాయ్ ఉత్సవం వంటి కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సక్సెస్ స్టోరీలుగా నిలిచాయని అన్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
భవిష్యత్ ప్రణాళికలు
అమరావతిలో రూ.100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టూరిజం ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని తెలిపారు. బ్లూ ఫ్లాగ్ బీచ్లు, ఎకో టూరిజం, టెంట్ సిటీలు, వాటర్ స్పోర్ట్స్, ఫిల్మ్ టూరిజం వంటి రంగాలకు కొత్త విధానాలు తీసుకువస్తామని వెల్లడించారు.
పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యం
పర్యాటక ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామని, గతంలో జరిగిన దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు.East godhavari Local News :విద్యుత్ శాఖపై 95 శాతం సంతృప్తి స్థాయే లక్ష్యం-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
నిడదవోలు అభివృద్ధి
తన నియోజకవర్గమైన నిడదవోలులో 20 నెలల్లో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రత్యేక గ్రేడ్ మున్సిపాలిటీ హోదా సాధించామని మంత్రి తెలిపారు.










