
విశాఖపట్నం:- మద్దిలపాలెంలోని ఎంఆర్సీ కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో కేంద్ర బడ్జెట్–2026పై నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో బడ్జెట్ వివరాలు ఇంగ్లీషులో ఉంటాయని, అందులోని ముఖ్యాంశాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వివరించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు.

మధ్యతరగతి కుటుంబాలు సంతోషంగా జీవించేందుకు, సామాన్యుడు సుఖసంతోషాలతో ఉండేందుకు, అలాగే ప్రపంచ పటంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ఈ బడ్జెట్ను రూపొందించారని చెప్పారు. దేశంలోని సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకూ అందరికీ ఉపయోగపడేలా, వారి జీవన ప్రమాణాలను వేగంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ బడ్జెట్ రూపుదిద్దుకుందని వివరించారు.
ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జీవిత బీమాలపై ‘జీరో’ పన్ను విధానం అమలు చేశామని, అనేక వస్తువులపై పన్నులు తగ్గించడం ద్వారా ప్రజలపై భారం తగ్గించామని తెలిపారు. గతంతో పోలిస్తే నిరుద్యోగం 3 శాతం తగ్గిందని పేర్కొన్నారు. దేశ భద్రతకు అత్యంత కీలకమైన డిఫెన్స్ బడ్జెట్ను 21 శాతం పెంచామని, డిఫెన్స్ అవసరాల కోసం కొనుగోలు చేసే ఎక్విప్మెంట్లో 75 శాతం స్వదేశంలోనే తయారు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రధాన విధానమని చెప్పారు. ప్రస్తుతం భారత్ నుంచి రూ.25 వేల కోట్ల డిఫెన్స్ ఎగుమతులు జరుగుతున్నాయని వెల్లడించారు.

రైల్వే బడ్జెట్ను 10 శాతం పెంచినట్లు పేర్కొన్న ఆయన, దేశవ్యాప్తంగా 7 హైస్పీడ్ రైల్వే కారిడార్లు ఏర్పాటు చేయబోతున్నామని, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా భాగం కావడం గర్వకారణమని అన్నారు. నరేగా పథకాన్ని ‘విబి–జీ రాం జీ’గా మార్చి, దీనికి అదనంగా రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించామని, ఈ నిధులతో దేశ, రాష్ట్రాల గతిని మార్చవచ్చని అభిప్రాయపడ్డారు. హెల్త్, రూరల్ డెవలప్మెంట్ రంగాలకు కూడా అదనంగా బడ్జెట్ పెంచామని తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి హయాంలో 90కి పైగా ప్రభుత్వ పథకాలు మరుగున పడ్డాయని, అర్థాంతరంగా నిలిచిపోయిన పథకాలపై వడ్డీలు చెల్లించి మరీ కూటమి ప్రభుత్వం వాటిని తిరిగి అమల్లోకి తెచ్చిందని విమర్శించారు. ఈ బడ్జెట్ ద్వారా బయో ఫార్మా రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఆటో డిసీజెస్ వంటి వ్యాధులకు త్వరితగతిన మందులు అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రైవర్లెస్ కార్స్ వంటి ఆధునిక సాంకేతికతలు దేశంలో అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు.
సెల్ఫోన్ తయారీకి అవసరమైన కాంపోనెంట్లను గతంలో పొరుగు దేశాల నుంచి దిగుమతి చేసుకునేవారని, ప్రస్తుతం కొత్త టెక్నాలజీతో స్వదేశంలోనే తయారీ జరుగుతోందని తెలిపారు. భారతదేశ సంపదైన టెక్స్టైల్ రంగాన్ని ఇండస్ట్రియల్గా ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని టెక్స్టైల్ ఇండస్ట్రీలను అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ఈ బడ్జెట్ ద్వారా ప్రయత్నిస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే MSMEలకు రూ.10 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారుVisakha Local News :హెచ్ఐవీ సంరక్షణ–చికిత్సపై వైద్యులకు శిక్షణా కార్యక్రమం.
మహిళల సంక్షేమం దిశగా ప్రతి జిల్లాలో ఉమెన్స్ హాస్టల్స్ ఏర్పాటు చేయడంతో పాటు, స్వయం ఉపాధికి ఉపయోగపడేలా అనేక రకాల నిధులు కేటాయించామని చెప్పారు. ఫిష్ ఫార్మింగ్, యానిమల్ హస్బెండ్రీ, కొబ్బరి, జీడిపప్పు తదితర రంగాల్లో సమృద్ధి సాధించేలా అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. డేటా సెంటర్లకు టాక్స్ హాలిడే ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్కు అత్యంత లాభం చేకూరుతుందని, ఉద్యోగాలు పెరిగి రాష్ట్రానికి మరిన్ని డేటా సెంటర్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
హై వాల్యూ అగ్రికల్చర్ దిశగా ఆంధ్రప్రదేశ్కు అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని, 16వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి అధిక నిధులు అందేలా పటిష్ట నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. పనులు ఎక్కువగా పూర్తి చేసే రాష్ట్రాలకు మరింత నిధులు కేటాయించే విధంగా కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. గత 12 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతోందని, ఇటీవల చేపట్టిన రహదారి నిర్మాణాలు గిన్నిస్ బుక్ రికార్డు సైతం నెలకొల్పాయని వెల్లడించారు.
దేశంలో ఎప్పుడూ లేని విధంగా నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణంతో పేదల ఇంటి కలను నిజం చేసే ప్రయత్నం జరుగుతోందని, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి, కేటాయిస్తున్న నిధులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, ఉత్తరాంధ్ర కో–ఆర్డినేటర్ వెంగమాంబ శ్రీనివాస్, బీజేపీ ఏపీ కోశాధికారి ఎం. నాగేంద్ర, MSME డైరెక్టర్ ఎన్. విజయానంద రెడ్డి, బీజేపీ ఏపీ కార్యదర్శి సుజాత తదితరులు పాల్గొన్నారు.










