
విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విద్యా శాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ఒక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం సీరియస్ తీసుకుంటుందని తెలిపారు. ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రైవేటు విద్యాసంస్థలపైనా ఉందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ‘యాక్టివ్ ఏపీ’ కార్యక్రమం ప్రారంభించి.. ఏడాదిలో కనీసం 150 రోజులు విద్యార్థులు ఆటలపై దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు.








