
హైదరాబాద్, అంబర్పేట్:- అంబర్పేట్లోని వాటర్ బోర్డ్ ఫిల్టరేషన్ ప్లాంట్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై స్థానిక రైతులు, భూ యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం తమ అనుమతి లేకుండానే పంట పొలాల మీదుగా పైప్లైన్లు వేసి తమకు గణనీయమైన నష్టం కలిగించారని వారు ఆరోపించారు.

ఈ వ్యవహారంపై ఇప్పటికే హైకోర్టులో కేసు నమోదు చేసినట్లు రైతులు తెలిపారు. అయినప్పటికీ సమస్యకు పరిష్కారం చూపకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
వాటర్ బోర్డ్ వర్క్స్ కాంపౌండ్ వాల్ సమీపంలోని పంట పొలాల్లోకి యథేచ్ఛగా నీటిని వదిలేయడం వల్ల పొలాలు పూర్తిగా నీట మునిగిపోతున్నాయని, దీంతో సాగు చేసిన పంటలు నాశనం అవుతున్నాయని రైతులు వాపోయారు. పంటలతో పాటు పశుగ్రాసం కోసం పొలాలకు వెళ్లే రైతుల రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు.Hyderabad news
అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ జీవనాధారం అయిన వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటోందని, కోత దశకు వచ్చిన పంటలు కూడా నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పంట పొలాల మీదుగా వేసిన పైప్లైన్ను తొలగించి, జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని వాటర్ బోర్డ్ అధికారులను డిమాండ్ చేశారు.
సమస్యకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. ఈ అంశంపై సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.










