
బాపట్ల, ఫిబ్రవరి 12:– కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా గురువారం నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెకు బాపట్ల జిల్లాలో కార్మిక, రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు.

సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్టియు సహా పలు కార్మిక సంఘాలు, రైతు మరియు కౌలు రైతు సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి.
ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కే. ధనలక్ష్మి మాట్లాడుతూ, 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ను తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. రోజుకు 8 గంటల పనిని 12 గంటలకు పెంచే అవకాశాలు కల్పించడం, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి అంశాలు కార్మికుల హక్కులను హరించేవని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, విదేశీ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని, బ్యాంకుల్లో తాత్కాలిక నియామకాలను రద్దు చేసి శాశ్వత నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి మార్పులు చేసి నిధుల వాటాను తగ్గించడం ద్వారా కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నారని రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఆరోపించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలకాశి మాట్లాడుతూ, అనేక సంవత్సరాల పోరాటాల ఫలితంగా సాధించిన కార్మిక చట్టాలను రద్దు చేయడం అన్యాయమని అన్నారు. కనీస వేతనాన్ని రూ.26,000గా అమలు చేయాలని, నిత్యావసర వస్తువులు, పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. పెట్టుబడిదారులకు రాయితీలు ఇస్తూ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకపోవడం సమంజసం కాదన్నారు. రైతులకు అన్ని పంటలకు కనీస మద్దతు ధరల చట్టం తీసుకురావాలని, పంట భీమా పథకాన్ని ఉచితంగా అమలు చేయాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసి పంట రుణాలు అందించాలని కోరారు.
ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ నాయకుడు మేకల ప్రసాద్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల రైతులు, ఉపాధి కూలీలు, కాంట్రాక్ట్ కార్మికుల హక్కులు కాలరాయబడితే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.Bapatla Local News
ఈ కార్యక్రమంలో ఎల్ఐసీ, ఆర్టీసీ, బ్యాంకింగ్, అంగన్వాడి, ఆశా, ఆటో, మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుధ్య, వ్యవసాయ విశ్వవిద్యాలయ టైం స్కేల్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, స్కూల్ స్వీపర్లు, భవన నిర్మాణ, ముఠా కార్మిక సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు రవికిరణ్, సత్యనారాయణ, కోటిదాసు, సింగరకొం, కరిముల్లా, నిరంజన్, బాబు, శైలజ శ్రీ, హేమమాలిని, కృష్ణవేణి, బుచ్చిరాజు, ఉమామహేశ్వరరావు, శ్రీనివాసరావు, లక్ష్మణరావు, శ్రీనివాసరెడ్డి, నాగమణి, కోటేశ్వరరావు, భాస్కరరావు, నాగేశ్వరరావు, డి.రవి, వినయరాజు తదితరులు పాల్గొన్నారు.
కార్మికులు, ఉద్యోగులు, రైతులు తమ హక్కులు సాధించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.










