
అమరావతి, ఫిబ్రవరి 12:- కృష్ణా డెల్టా పరిధిలో కీలకమైన రోంపేరు వరద కాలువ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బాపట్ల జిల్లాలోని రోంపేరు రైట్ ఆర్మ్ డ్రెయిన్లో పేరుకుపోయిన సిల్ట్ తొలగింపు (డ్రెడ్జింగ్) పనులకు రూ.26.50 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరైంది. జలవనరుల శాఖ (ప్రాజెక్ట్స్–II) జారీ చేసిన జీఓ ఆర్టీ నెం.59 ద్వారా ఈ మేరకు ఆమోదం లభించింది.

కిలోమీటరు 30.450 నుంచి 37.600 వరకు సుమారు 6.500 కిలోమీటర్ల మేర డ్రెడ్జింగ్ చేపట్టనున్నారు. మొత్తం 7.500 కిలోమీటర్ల మేర ఆధునికీకరణ పనులు చేపట్టే దిశగా చర్యలు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.
దీర్ఘకాలంగా డ్రెయిన్లో సిల్ట్ పేరుకుపోవడంతో నీటి ప్రవాహం మందగించి వరద ముప్పు పెరిగింది. ఫలితంగా పంట పొలాలు ముంపుకు గురై రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతిపాదిత డ్రెడ్జింగ్ పనులు పూర్తయితే నీటి ప్రవాహ సామర్థ్యం గణనీయంగా పెరిగి వరద ఉధృతి తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు.

ఈ పనులు పూర్తయితే పర్చూరు, బాపట్ల, చీరాల నియోజకవర్గాల పరిధిలో సుమారు 75 వేల ఎకరాలకు ముంపు ముప్పు తగ్గనుంది. చిన్నగంజాం, పర్చూరు, మార్టూరు, యద్దనపూడి, ఇంకొల్లు, కారంచేడు, చీరాల, వేటపాలెం, బాపట్ల మండలాల్లోని పంట పొలాలకు ఇది రక్షణ కవచంగా నిలుస్తుందని భావిస్తున్నారు.Bapatla Local News
ఈ నిధుల మంజూరులో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక కృషి కీలకమని అధికార వర్గాలు వెల్లడించాయి. రోంపేరు డ్రెయిన్ సమస్యపై పలుమార్లు ఉన్నతాధికారులతో సమావేశమై రైతుల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కృష్ణా డెల్టా ప్రాంతంలో కాల్వలు, డ్రెయిన్ల పునరుద్ధరణ అత్యవసరమని వివరిస్తూ సమగ్ర ప్రతిపాదనలు సమర్పించినట్లు సమాచారం.
సాగునీటి వసతుల బలోపేతంతో వ్యవసాయ రంగానికి బలమైన పునాది వేయడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. డెల్టా ప్రాంతంలో కాల్వల పునరుద్ధరణ, డ్రెయిన్ల శుద్ధీకరణ పనులు దశలవారీగా చేపట్టనున్నట్లు తెలిపారు. రోంపేరు డ్రెడ్జింగ్ ఆ దిశగా కీలక అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
నిధుల మంజూరుతో పర్చూరు, చీరాల పరిసర ప్రాంత రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వరద ముప్పు తగ్గి పంటల దిగుబడి పెరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.










