
హైదరాబాద్, అంబర్పేట్:- అంబర్పేట్ సీపీఎల్ జీహెచ్ఎంసీ రోడ్లో వాటర్ వర్క్స్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాగునీరు భారీగా వృథా అవుతోంది. రోడ్డుపై లీకేజీతో రోజూ నీరు పారిపోతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం స్థానికులను ఆగ్రహానికి గురి చేస్తోంది.

రోడ్డు మధ్యలో నుంచి నిరంతరం నీరు పొంగిపొర్లుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి మొత్తం నీటితో నిండిపోవడంతో జారిపడే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాద భయంతో ప్రయాణిస్తున్నారు. ట్రాఫిక్కు కూడా అంతరాయం కలుగుతోంది.
స్థానికులు పలుమార్లు వాటర్ వర్క్స్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీసింది. ప్రతిసారి అధికారులు వస్తామని చెప్పి వెళ్లిపోతున్నారే తప్ప, లీకేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేకపోతున్నారు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎండాకాలం సమీపిస్తున్న తరుణంలో ఒకవైపు నగరంలోని పలుచోట్ల తాగునీటి కొరత నెలకొంటుండగా, మరోవైపు ఇలాంటి విధంగా నీరు వృథా కావడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. నీటి కోసం ప్రజలు అల్లాడుతున్న సమయంలో విలువైన నీటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉన్న అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే లీకేజీని సరిచేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా ధనంతో సరఫరా అయ్యే నీటిని కాపాడే బాధ్యత అధికారులదేనని వారు స్పష్టం చేస్తున్నారు.Hyderabad local news










